టోక్యో: జపాన్లో రసవత్తరంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్లో 13వ రోజు భారత్ మిశ్రమ ఫలితాలను చవి చూస్తోంది. అన్నింటికి మించి- మరో పతకం ఖాయం చేసుకుంది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో ఓటమి ఎరుగని రవికుమార్ దహియా ఫైనల్స్కు దూసుకెళ్లాడు. తొలుత 1/8 ఫైనల్ రౌండ్లో విజయం సాధించాడు. అనంతరం క్వార్టర్ ఫైనల్స్, ఆ తరువాత సెమీ ఫైనల్స్లో తనకు తిరుగులేదనిపించుకున్నాడు. అతను ఫైనల్స్ ఎంట్రీ ఇవ్వడంతో పతకం ఖాయమైంది. గురువారం అతను ఫైనల్ బౌట్ ఆడాల్సి ఉంది. రవి దహియా సాధించిన ఈ విజయంతో భారత పతకాల సంఖ్య నాలుగుకు పెరిగింది.
అదే సమయంలో రవి దహియాతో పాటు దండయాత్రను ప్రారంభించిన మరో రెజ్లర్ దీపక్ పునియా అనూహ్యంగా ఓటమిని చవి చూశాడు. సెమీ ఫైనల్స్లో ఓడిపోయాడు. అతని జైత్రయాత్రకు సెమీ ఫైనల్లో అడ్డుకట్ట పడింది. అమెరికా రెజ్లర్ డేవిడ్ టేలర్.. పునియా జోరును అడ్డుకున్నాడు. సెమీ ఫైనల్స్లో ఓడించాడు. ఒకరకంగా ఈ బౌట్ మొత్తం కూడా ఏకపక్షంగా సాగింది. డేవిడ్ టేలర్ ఆధిపత్యం ప్రదర్శించాడు. 10-0తో పునియా ఈ బౌట్ను కోల్పోయాడు. పునియాను పుంజుకోవడానికి ఏ మాత్రం కూడా అవకాశాన్ని ఇవ్వలేదా అమెరికన్ రెజ్లర్.
నిజానికి- రవి కుమార్ దహియాతో పాటే ఈ ఉదయం నుంచి తాను ఎదుర్కొన్న అన్ని బౌట్లలోనూ దీపక్ పునియా తిరుగులేని విజయాలను సాధిస్తూ వచ్చాడు. తొలుత 1/8 ఫైనల్ రౌండ్లో నైజీరియాకు చెందిన ఎకెరెకెమె అగియోమోర్ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్స్లో అడుగు పెట్టాడు. ఆ తరువాత క్వార్టర్ ఫైనల్స్లో చైనాకు చెందిన లిన్ ఝుషెన్ను ఓడించాడు ఈ మ్యాచ్లో 6-3 పాయింట్లతో పునియా సెమీ ఫైనల్స్కు దూసుకెళ్లాడు. అక్కడ కూడా అదే దూకుడును కొనసాగిస్తాడని భారతీయులు ఆశించారు.. ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
అదే సమయంలో రవి కుమార్ దహియా సెమీ ఫైనల్స్లో ఘన విజయం సాధించి, పతకాన్ని ఖాయం చేసుకోవడంతో ఇక దీపక్ పునియా కూడా అదే రేంజ్లో చెలరేగిపోతాడని అంచనా వేశారు. అందరి అంచనాలను తలకిందులు చేశాడు పునియా. గెలిచి తీరాల్సిన బౌట్లో అంచనాలకు అనుగుణంగా సత్తా చాటలేకపోయాడు. పరాజయాన్ని చవి చూశాడు. అమెరికన్ రెజ్లర్ డేవిడ్ టేలర్ చేతిలో 0-10 తేడాతో ఓడిపోయాడు. దీనితో అతని జైత్రయాత్రకు సెమీ ఫైనల్లో అడ్డుకట్ట పడినట్టయింది.