న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలన్నీ ఆగిపోయిన నేపథ్యంలో షూటర్ల ప్రాక్టీస్ కోసం తలపెట్టిన అంతర్జాతీయ ఆన్లైన్ షూటింగ్ టోర్నీని బుధవారం విజయవంతంగా నిర్వహించారు. జూమ్ యాప్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మంది షూటర్లు టోర్నీలో పాల్గొన్నారు. తొలిసారి జరిగిన అంతర్జాతీయ ఆన్లైన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్లు అదరగొట్టారు. షూటర్లు మను భాకర్, మేఘన సజ్జనార్, అమన్ప్రీత్ సింగ్ సత్తాచాటారు.
2021 వన్డే ప్రపంచకప్నకు భారత్ అర్హత!!
బుధవారం ఆన్లైన్లో జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరీలో అమన్ప్రీత్ సింగ్ (576), అశిష్ దబాస్ (575) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. టీనేజ్ సంచలనం మను భాకర్ (572) 3వ స్థానాన్ని సొంతం చేసుకుంది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంటులో భారత అమ్మాయి మేఘన సజ్జనార్ 630.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా.. ఆస్ట్రియాకు చెందిన మార్టిన్ స్ట్రెంఫుల్ (632.5) టాప్ ప్లేస్ దక్కించుకుంది. వరల్డ్ నెంబర్ వన్ దివ్యాంశ్ సింగ్ పన్వర్ 627.8 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకున్నాడు.
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్ సమయాన్ని భారత షూటర్లు ఇలా తమదైన రీతిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇండ్లకే పరిమితమవుతూ ఆన్లైన్ ద్వారా పోటీపడేందుకు సిద్ధమయ్యారు. లాక్డౌన్ వేళ.. ఇంట్లో కూర్చునే అద్భుతంగా ఆన్లైన్ షూటింగ్ టోర్నీ ఆడేశారు మన భారత షూటర్లు. ఇంటి నుంచే నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ నిబంధనల్ని అనుసరించి ఎలక్ట్రానిక్ షూటింగ్ లక్ష్యాలకు షూటర్లు గురి పెట్టారు.
ఈ టోర్నీ కోసం భారత క్రీడాకారులంతా ఇళ్లలోనే ఉంటూ సాధనలో మునిగిపోయారు. ఈ సందర్భంగా టీనేజ్ సెన్సేషన్ మను భకర్ తన ఇంటి ఆవరణలో ప్రాక్టీస్ చేస్తుంటే కొన్నిసార్లు కోతుల బెడద ఉంటోందని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'రోజుకు 4గంటలు సాధన చేస్తున్నా. అయితే మా ప్రాంతంలో కొన్ని కోతులున్నాయి. అవి మా ఆవరణలోకి వచ్చి అంతరాయం కలిగిస్తుండడమే చికాకు తెప్పిస్తోంది' అని వివరించింది.