హైదరాబాద్: భారత కామన్వెల్త్ అథ్లెట్లు బస చేసిన ప్రాంగణంలో వాడేసిన సిరంజీలుండటం కలకలం రేపింది. భారత క్రీడాకారులెవరైనా డోపింగ్కు పాల్పడ్డారేమో అన్న అనుమానాలు తలెత్తాయి. ఇంకో నాలుగు రోజుల్లో కామన్వెల్త్ క్రీడలు ఆరంభం కానున్న తరుణంలో ఈ పరిణామం పెద్ద చర్చకే దారి తీసింది. వెంటనే ఈ విషయాన్ని సిబ్బంది తనకు తెలిపారని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గ్రీవెంబర్గ్ వెల్లడించారు.
అయితే... దీనిని భారత బృందంతో ఉన్న అధికారి తీవ్రంగా పరిగణించి, ఖండించారు. 'సిరంజీలు మా ఆటగాళ్ల గదుల్లో దొరకలేదు. వివిధ దేశాల క్రీడాకారులంతా ఉన్న భవనం వద్ద లభించాయి. మేమే వాటిని సీజీఎఫ్ వైద్యాధికారులకు అప్పగించాం. తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం లేదు' అని ఆయన స్పష్టం చేశారు.
CWG 2018: Indian players face investigation over syringes in Commonwealth Games Village #CWG2018 pic.twitter.com/spMNKm66ZK
— Doordarshan Sports (@ddsportschannel) March 31, 2018
ఈ విషయంలో తమను ప్రశ్నించేందుకు, అనుమానించేందుకు అవకాశం లేదని చెప్పారు. కొందరు భారత ఆటగాళ్లకు డోప్ పరీక్షలు చేయనున్నారన్న వార్తలు రాగా...భారత్ తరఫున డోపీలెవరూ పోటీ పడట్లేదు. అది క్రీడలకు ముందు సహజంగా జరిగేదేనని, సిరంజీల ఉదంతంతో సంబంధం లేదని పేర్కొన్నారు.
భారత ఆటగాళ్లకు క్రీడల ఆరంభానికి ముందే అందరికీ పరీక్షలు నిర్వహించింది. కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో బుధవారం ఆరంభం కాబోతున్న సంగతి తెలిసిందే.మరోవైపు ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని డేవిడ్ గ్రీవెంబర్గ్ తెలిపారు.