కారును అమ్మాలనుకుంటున్నా:
టోక్యో ఒలింపిక్స్ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో ద్యుతి చంద్ నిధుల కొరతతో సతమతమవుతున్నారు. దీంతో ఆమె శిక్షణ ఖర్చుల కోసం తన కారును అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. శిక్షణ ఖర్చులు తీర్చేందుకు బీఎండబ్ల్యూ కారును సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని ద్యుతినే శనివారం ఫేస్బుక్లో వెల్లడించారు. 'ఇప్పటివరకు శిక్షణ చాలా బాగుంది. నేను భువనేశ్వర్లో శిక్షణ పొందుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, స్పాన్సర్లు ఇచ్చిన నిధులన్నీ కోచింగ్కు ఖర్చు చేశా. అందుకే నా లగ్జరీ బీఎండబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నా. ఎవరైనా కొనాలనుకుంటే నన్ను మెసేంజర్లో సంప్రదించండి' అంటూ కారుకు చెందిన ఫోటోలను పోస్టులో పెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం సాయం:
అయితే ఫేసుబుక్లో పోస్ట్ పెట్టిన తర్వాత ద్యుతి చంద్కు సాయం చేసేందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో తరువాత ఆ పోస్టును ఆమె డిలీట్ చేశారు. కాగా ద్యుతీ చంద్ 2015 బీఎండబ్ల్యూ 3 సిరీస్ మోడల్ను కలిగి ఉన్నారు. ఆమె దానిని 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ కారును స్వయంగా ద్యుతినే కొనుగోలు చేశారు. ఇంట్లో మూడు కార్లు ఉన్నాయి కాబట్టి ఒక కారు అమ్మాలనుకున్నారు.
డబ్బులన్నీ అయిపోయాయి:
ఓ జాతీయ మీడియాతో ద్యుతీ మాట్లాడుతూ... 'టోక్యో ఒలింపిక్స్ శిక్షణ కోసం ప్రభుత్వం రూ .50 లక్షలు మంజూరు చేసింది. కోచ్, ఫిజియోథెరపిస్ట్స్, డైటీషియన్తో పాటు ఇతర ఖర్చులు కలిపి నాకు నెలకు అయిదు లక్షల రూపాయలు ఖర్చవుతోంది. ఇప్పడు నా డబ్బులన్నీ అయిపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏ స్పాన్సర్ నా కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా లేడు. కానీ నేను టోక్యో ఒలింపిక్ కోసం సిద్ధమవుతున్నాను. నా ఫిట్నెస్, జర్మనీలో శిక్షణ కోసం నాకు డబ్బు కావాలి. నా శిక్షణ, డైట్ ఖర్చులను తీర్చడానికి దీనిని అమ్మేయాలని నిర్ణయించుకున్నా' అని తెలిపారు.
అర్జున అవార్డుకి ఎంపిక:
ద్యుతి చంద్ ఇటీవల అర్జున అవార్డు 2020కి ఎంపికయ్యారు. ఆమె ఆసియా గేమ్స్లో రెండు సార్లు రజత పతకాలు సాధించారు. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ప్రస్తుతం ద్యుతి సిద్ధమవుతోంది. లాక్డౌన్ కారణంగా రెండు నెలల విరామం తర్వాత మే 25న చంద్ కళింగ స్టేడియంలో ఆమె శిక్షణను ప్రారంభించారు. ఒలింపిక్స్ వాయిదా పడడంతో ఆమె పూర్తిస్థాయి ఫిట్నెస్ కోసం మరో ఏడాది శిక్షణ తీసుకోవాల్సి ఉంది.