టోక్యో: జపాన్ వేదికగా ఈరోజు ప్రారంభం అయిన టోక్యో ఒలింపిక్స్లో పతకం ఖాయమనుకున్న గేమ్స్లో ఆర్చరీ ఒకటి. కానీ తొలి రోజే అర్హత రౌండ్లలో భారత ఆర్చర్లు పూర్తిగా నిరాశపరిచారు. మహిళల సింగిల్స్లో దీపికా కుమారి 9వ ర్యాంక్తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక పురుషుల సింగిల్స్లో అయితే మన వాళ్ల ప్రదర్శన మరింత దారుణంగా ఉంది. స్టార్ ప్లేయర్ అతాను దాస్ అంచనాలను అందుకోలేకపోయాడు.
ర్యాంకింగ్ రౌండ్లో భారత్ నుంచి ప్రవీణ్ జాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రవీణ్ 656 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున ఇదే బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అతాను దాస్ అయితే 653 పాయింట్లతో 35వ స్థానానికి పరిమితమయ్యాడు. అయితే ప్రవీణ్ కంటే అతడు రెండు 10లు ఎక్కువ కొట్టాడు. అతాను మొత్తం 24 10లు సాధించాడు. మరో ఆర్చర్ తరుణ్దీప్ రాయ్ 37వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇప్పుడు సాధించిన ర్యాంకుల ఆధారంగానే తొలిరౌండ్లో ప్రత్యర్థులను నిర్ణయిస్తారు. ఈ ముగ్గురి (ప్రవీణ్, అతాను, తరుణ్దీప్) పాయింట్లను కలిపి బృంద ర్యాంకు ఇస్తారు. ఇక మిక్స్డ్ డబుల్స్లో మహిళల, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన పాయింట్ల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.
మహిళల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలిచింది. కొరియా అమ్మాయి, దీపిక ప్రధాన ప్రత్యర్థి ఆన్ సాన్ ఒలింపిక్స్ రికార్డు నమోదు చేసింది. ప్రపంచ నంబర్ వన్ దీపికా కుమారి 663 పాయింట్లు సాధించగా ఆన్ సాన్ 680 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి రౌండ్లో భూటాన్కు చెందిన కర్మతో దీపిక తలపడనుంది. ప్రస్తుతం ఆమె ర్యాంకు 193 కావడం గమనార్హం. ఆమెపై విజయం సాధించడం భారత ఆర్చర్కు సులువే. సాన్తో దీపిక క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IND vs CSXI: రాణించిన మయాంక్, విహారి.. కౌంటీ ఎలెవన్తో సన్నాహక మ్యాచ్ డ్రా!!