గోల్ఫ్లో పతకానికి చేరువగా..
మహిళల వ్యక్తిగత స్ట్రైకింగ్ గోల్ఫ్ ఈవెంట్లో పతకం ఖాయమౌతుందనుకున్న దశలో తడబడింది భారత్. ఈ కేటగిరీకి ప్రాతినిథ్యాన్ని వహించిన బెంగళూరుకు చెందిన ఈ 23 సంవత్సరాల గోల్ఫర్ ఆదితి అశోక్ చివరిదైన నాలుగో రౌండ్లో సత్తా చాటినప్పటికీ అది సరిపోలేదు. నాలుగో రౌండ్ ఆరంభంలో రెండో స్థానంలో నిలిచిన ఆమె.. తోటి ప్రత్యర్థులు విజృంభించడంతో మూడో స్థానానికి పడిపోయారు. చాలా సేపటి వరకు మూడో స్థానంలో కొనసాగారు. అదే సమయంలో న్యూజిలాండ్కు చెందిన లైడియా కో దూసుకురావడంతో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. కాంస్య పతకాన్ని కోల్పోయారు.
పురుషుల జావెలిన్ థ్రో ఫైనల్స్కు..
మరోవంక- ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భారత్.. పురుషుల జావెలిన్ థ్రో (Javelin throw) విభాగంలో ఫైనల్స్కు అర్హత సాధించింది. ఇది సరికొత్త రికార్డ్. ఈ ఈవెంట్లో భారత్కు ప్రాతినిథ్యాన్ని వహించిన నీరజ్ చోప్రా ఈ సాయంత్రం ఫైనల్స్ ఆడనున్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటిదాకా ఏ థ్రోయర్ కూడా భారత్ను ఫైనల్స్ వరకూ తీసుకెళ్లలేదు. అలాంటి అసాధారణ కార్యక్రమాన్ని అవలీలగా పూర్తి చేశాడు. క్వాలిఫికేషన్స్ రౌండ్లో దుమ్ము దులిపాడు. తొలి ప్రయత్నంలోనే అతను ఏకంగా 86.65 మీటర్ల దూరం వరకు జావెలిన్ను సంధించాడు. ఈ విభాగంలో పాయింట్ల పట్టికలో నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలిచాడు. ఇదీ రికార్డే.
అంచనాల్లేకుండా బరిలోకి..
ఇది అనూహ్యం. ఏ మాత్రం అంచనాలు లేకుండా.. ఒత్తిడికి అందకుండా.. దానికి లొంగకుండా నీరజ్ చోప్రా బరిలోకి దిగాడు. విసరడం..విసరడంతోనే ఫైనల్కు అర్హత సాధించాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే అతను రికార్డ్ స్థాయి దూరానికి జావెలిన్ను సంధించాడు. గ్రూప్-ఏ విభాగంలో అతనే టాపర్. భారత్ను తొలి స్థానంలో నిలిపాడు నీరజ్ చోప్రా. కాగా గ్రూప్-బీ విభాగంలో శివ్పాల్ సింగ్ నిరాశ పరిచాడు. జావెలిన్ థ్రో విభాగంలో ఫైనల్స్కు చేరాలంటే 83.50 మీటర్ల దూరం పాటు జావెలిన్ను విసరాల్సి ఉంటుంది.. లేదా తొలి 12 మందిలో నిలవాల్సి ఉంటుంది. అలాంటి ఛాలెంజ్ను అతను అలవోకగా అధిగమించాడు.
గ్రూప్-బీ టాపర్గా పాకిస్తాన్
పురుషుల జావెలిన్ థ్రో విభాగం గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలవగా.. గ్రూప్-బీలో పాకిస్తాన్ ఆ ప్లేస్ను ఆక్రమించుకుంది. పాకిస్తాన్ జావెలిన్ థ్రయోర్ అర్షద్ నదీం.. గ్రూప్-బీలో మొదటి స్థానంలో ఉన్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో అర్షద్ 85.16 మీటర్ల దూరం పాటు జావెలిన్ను విసిరాడు. ఇదే గ్రూప్-బీలో భారత్ తరఫున పాల్గొన్న శివ్పాల్ సింగ్ ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయాడు. భారత్ నుంచి నీరజ్ చోప్రా.. పాకిస్తాన్ నుంచి అర్షద్ నదీం ఇద్దరూ ఫైనల్స్లో ఎంట్రీ ఇచ్చారు. దీనితో పోటీ రసవత్తరంగా మారింది. ఎవరు పతకాన్ని సాధిస్తారనేది ఆసక్తికరంగా మారంది.
ఇన్నాళ్లూ క్రికెట్లోనే అనుకుంటే..
క్రీడా ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది క్రికెట్. ఈ స్పోర్ట్ ఈవెంట్లో ఈ రెండు దేశాల మధ్య ఆటకు మించిన వైరం ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు. కోట్లాదిమంది భారతీయుల మనోభావాలతో కూడుకుని ఉంటుంది క్రికెట్లో ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్. ఈ పోరులో చాలాసార్లు భారత్దే పైచేయి. ఇప్పటికీ అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది టీమిండియా. ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ను ఓడించిన చరిత్ర పాకిస్తాన్కు లేదు. అదే తరహాలో ఇక ఒలింపిక్స్లోనూ నీరజ్ చోప్రా.. పాకిస్తాన్ థ్రోయర్ను మట్టి కరిపించి పతకాన్ని సాధించాలని అభిమానులు కోరుకుంటోన్నారు.
7న ఫైనల్స్..
జావెలిన్ థ్రోలో నీరజ్ చోప్రా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. క్వాలిఫై రౌండ్లో అతను 86.65 మీటర్ల దూరం జావెలిన్ను విసిరాడు. ఈ కేటగిరీలో భారత్ అగ్రస్థానంలో నిలవగా.. జర్మనీ, ఫిన్లాండ్ రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. ఫైనల్ ఈవెంట్ ఈ సాయంత్రం 4:30 గంటలకు ఉంటుంది. క్వాలిఫై రౌండ్లో ప్రదర్శించిన ఫామ్ను నీరజ్ చోప్రా కొనసాగించగలిగితే భారత్కు మరో పతకం ఖాయమైనట్టే. ఇందులో టాపర్గా నిలవగలిగితే.. భారత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడే సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టే అవుతుంది.
ఇద్దరి మధ్య తేడా ఇదే..
క్వాలిఫికేషన్ రౌండ్లో పాకిస్తాన్ థ్రోయర్ అర్షద్ నదీం 85.16 మీటర్ల దూరం పాటు జావెలిన్ను సంధించాడు. ఇక్కడ నీరజ్ చోప్రాతో కంపేర్ చేసుకుంటే.. ఇద్దరి మధ్యా 11 మీటర్ల మేర వ్యత్యాసం కనిపిస్తోంది. అంటే- అర్షద్ నదీం- నీరజ్ చోప్రాకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడనే అనుకోవచ్చు క్వాలిఫికేషన్స్ రౌండ్లో. ఇద్దరూ వేర్వేరు గ్రూపుల్లో ఉండటం వల్ల ఇద్దరూ తారసపడలేదు. ఫైనల్స్లో మాత్రం పరిస్థితి అలా ఉండదు. క్వాలిఫై అయిన థ్రయోర్లందరూ ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది. క్వాలిఫై రౌండ్లో ప్రదర్శించిన దూకుడును నీరజ్ చోప్రా కొనసాగించగలిగితే మాత్రం పతకం అందుకోవడాన్ని ఎవరూ అడ్డుకోలేరు.. అది ఎవరి తరమూ కాదు కూడా.