టోక్యో: ఒలింపిక్స్లో ఉత్కంఠతకు గురి చేసే అథ్లెటిక్స్ ఈవెంట్స్ మొదలయ్యాయి. ఈ కేటగిరీలోకి ద్యుతీచంద్, సార్థక్ భంబ్రీ, అవినాష్ సబ్లె వంటి పలువురు భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. ఈ ఉదయం నిర్వహించిన 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో భారత్ వెనుకంజ వేసింది. ఈ కేటగిరీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న భారత స్టార్ అథ్లెట్ అవినాష్ ముకుంద్ సబ్లె.. ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయాడు. ఏడో స్థానంలో నిలిచాడు. ఈ విషయంలో అతను జాతీయ రికార్డ్ నెలకొల్పాడు. తన వ్యక్తిగత రికార్డ్ను కూడా సవరించుకున్నాడు.
Deepika Kumari..పర్ఫెక్ట్ షాట్: పతకాలపై ఆశలు రేకెత్తించి..: క్వార్టర్స్లో దూసుకెళ్లిన బాణం
టోక్యో ఒలింపిక్స్ స్టేడియంలో నిర్వహించిన ఈ ఈవెంట్ హీట్-2లో అవినాష్ సబ్లె 8:18:12 టైమింగ్తో ఏడో స్థానంలో నిలిచాడు. జాతీయ స్థాయిలో అతని రికార్డు 8:20:20. దీన్ని సవరించుకున్నాడతను. పటియాలో నిర్వహించిన 24వ నేషనల్ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అవినాష్ సబ్లె జాతీయ రికార్డును నెలకొల్పాడు. జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డ్ను సృష్టించాడు. ఆ అనుభవంతో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ప్రీఫైనల్స్లో అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లకు గట్టి పోటీని ఇవ్వగలిగాడు.. ఏడో స్థానంతో టాప్ టెన్లో నిలవగలిగాడు. ఫైనల్స్కు అర్హతను సాధించడానికి అది ఉపయోగపడలేదు.
ఈ కేటగిరీలో కెన్యాకు చెందిన అథ్లెట్ అబ్రహం కిబివొట్ టాపర్గా నిలిచాడు. అతని టైమింగ్.. 8:12:25. అలాగే ఇథియోపియాకు చెందిన వేల్ గెట్నెట్ రెండో స్థానంలో, ఇటలీ అథ్లెట్ అహ్మద్ అబ్దెల్వహద్ మూడోస్థానంలో నిలిచారు. ప్రతి హీట్లో నిలిచిన తొలి ముగ్గురు అథ్లెట్లను ఫైనల్స్కు అర్హత సాధించినట్లు గుర్తిస్తారు. ఆరు ఫాస్టెస్ట్ స్టీపుల్ఛేజ్లో వారు పాల్గొనాల్సి ఉంటుంది. దాన్ని అడ్వాన్స్డ్ ఫైనల్గా భావిస్తారు. ఈ ఫైనల్ హీట్.. ఆగస్టు 2వ తేదీన ఒలింపిక్స్ స్టేడియంలో నిర్వహిస్తారు. అవినాష్ సబ్లె గంటన్నర పాటు తన పేస్ను కొనసాగించినప్పటికీ.. దాన్ని చివరి వరకూ తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు.