
హైదరాబాద్: పదవులు వద్దని పందెంలో పాల్గొనాలని వయస్సును లెక్క చేయకుండా మళ్లీ బాక్సింగ్ బరిలోకి దిగిన మేరీ కోమ్ టోర్నీల్లో దూసుకుపోతోంది. ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో స్టార్ బాక్సర్ మేరీకోం, తెలుగు తేజం శ్యాం కుమార్ ఫైనల్లో ప్రవేశించారు.
శివ థాప, మనోజ్ కుమార్లకు నిరాశ తప్పలేదు. సెమీస్లో ఓడిన ఈ ఇద్దరు కాంస్యంతో సరిపెట్టుకున్నారు. మహిళల 48 కిలోల సెమీస్లో పన్నెండో సీడ్ మేరీకోం కఠిన ప్రత్యర్థి అల్తాన్సెట్సెగ్ లుత్సైఖాన్ను అలవోకగా ఓడించింది. సరిత దేవి, పింకి జాంగ్ర, సోనియా కూడా ఫైనల్ చేరారు.
పురుషుల విభాగంలో శ్యామ్ కుమార్ (49 కిలోలు), అమిత్ పంగల్, సతీశ్ కుమార్ (+91 కిలోలు) ఫైనల్ బెర్తులు దక్కించుకున్నారు. గాయం కారణంగా సుమిత్ సంగ్వాన్ సెమీస్ నుంచి వైదొలిగాడు. పురుషుల 60 కిలోల విభాగంలో టాప్సీడ్ శివ థాపకు మనీష్ కౌశిక్ షాకిచ్చాడు. నిరుడు జాతీయ ఛాంపియన్షిప్లో కూడా శివను మనీష్ ఓడించాడు.
69 కిలోల సెమీస్లో మనోజ్ కుమార్ సహచరుడు దినేశ్ చేతిలో ఓడిపోయాడు. మరోవైపు థాయ్లాండ్కు చెందిన నరిన్రామ్ థాని గాయం కారణంగా వైదొలగడంతో పోటీపడకుండానే శ్యాం ఫైనల్లో చోటు దక్కించుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.