IAAF World Championships 2019: బోల్ట్ లేకుండా తొలిసారి, భారత్ నుంచి 27 మంది

హైదరాబాద్: ప్రతిష్టాత్మక అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్షిప్నకు సర్వం సిద్ధమైంది. ఖతార్ రాజధాని దోహా వేదికగా శుక్రవారం ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. శుక్రవారం మొదలై మొత్తం 10 రోజులు అంటే అక్టోబర్ 6 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడనున్నారు.
మొత్తం 24 ఈవెంట్లలో ప్రపంచంలోని 210 దేశాల నుంచి అథ్లెట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. 16 ఏళ్ల తర్వాత తొలిసారి జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఈ ప్రపంచ చాంపియన్షిప్నకు దూరమయ్యాడు. ఈ టోర్నీ కోసం ఖతార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదిక ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం ఈ టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రధాన స్టేడియం సామర్థ్యం 40వేల మంది
ఈ స్టేడియం సామర్థ్యం 40వేల మంది. ఉసేన్ బోల్ట్ లేకపోవడంతో ఈ చాంపియన్షిప్లో 100 మీట్లర్ల ప్రపంచ చాంపియన్ జస్టిన్ గాట్లిన్, ఆరు ఒలింపిక్ స్వర్ణ పతకాల విజేత అలీసన్ ఫెలిక్స్(అమెరికా), కోల్మన్(అమెరికా) హైలెట్గా నిలువనున్నారు. ఇక, భారత్ విషయానికి వస్తే మొత్తం 27 మంది అథ్లెట్లు చాంపియన్షిప్లో అడుగుపెట్టనున్నారు.

నీరజ్ చోప్రా, హిమాదాస్ దూరం
జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, యువ స్ప్రింటర్ హిమాదాస్ ఈ టోర్నీకి దూరమయ్యారు. ముఖ్యంగా రిలే పోటీలపై భారత్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈసారి 27 మంది బరిలోకి దిగనుండగా వారిలో 13మంది రిలేల్లోనే పోటీ పడనున్నారు. ఈ చాంపియన్షిప్లో భారత్ 4x400 మీటర్ల రిలేల్లో పురుషుల, మహిళల, మిక్స్డ్ విభాగాల్లో భారత్ పోటీ పడనుంది.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖతార్
ఈ చాంపియన్షిప్లో ఎం.శ్రీశంకర్ (లాంగ్జంప్), జిన్సన్ జాన్సన్(మెట్రిక్ మైల్ రన్), తేజీందర్పాల్ సింగ్ తూర్(షాట్పుట్), ద్యుతీచంద్(100 మీటర్లు) ఫైనల్స్కు చేరే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, 2022 ఫిఫా ప్రపంచకప్కు కూడా ఖతార్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ చాంపియన్షిప్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కొత్త జెర్సీల్లో బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లు
ఈ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు కొత్త కిట్లను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) గురువారం ఆవిష్కరించింది. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ మినహా అన్ని అంతర్జాతీయ టోర్నీల్లో ఇప్పటి నుంచి జాతీయ అథ్లెటిక్ జట్టు ఇదే జెర్సీతో బరిలోకి దిగుతుందని ఏఎఫ్ఐ అధ్యక్షుడు సుమరివాలా తెలిపారు.

4x400మీటర్ల రిలేలో మిక్స్డ్ విభాగం
ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో తొలిసారిగా 4x400మీటర్ల రిలేలో మిక్స్డ్ విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఇంతవరకు పురుషులు, మహిళలు వేరువేరుగా తలపడుతుండగా.. ఈసారి మిక్స్డ్ విభాగంలో ఇద్దరూ కలిసి బరిలోకి దిగనున్నారు. జట్టులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉండనున్నారు.

అర్ధరాత్రి పోటీలు నిర్వహణ
దోహాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో స్టేడియాల్లో పెద్ద సంఖ్యలో ఏసీలను ఏర్పాటు చేశారు. ప్రధాన పోటీలు జరిగే ఖలీఫా అంతర్జాతీయ స్టేడియ సమీపంలో 40 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో అథ్లెట్లకు, ప్రేక్షకులకు ఇబ్బందులు కలగకుండా స్టేడియాల్లో భారీ ఏసీలు ఏర్పాటు చేశారు. కృత్తిమ మంచును సైతం చల్లనున్నారు. దీంతో సుదీర్ఘ సమయం సాగే మారథాన్ పోటీలను అర్ధరాత్రి వేళల్లో నిర్వహించే ఏర్పాట్లు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications