న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ హిమదాస్ ప్రతిష్టాత్మక 'రాజీవ్గాంధీ ఖేల్రత్న' అవార్డు బరిలో నిలిచింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన 'ఖేల్రత్న'కోసం 20 ఏళ్ల హిమదాస్ పేరును కేంద్ర క్రీడాశాఖకు అసోం ప్రభుత్వం సిఫారసు చేసింది. రెండేళ్ల క్రితం అత్యద్భుత ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ స్టార్ను ఖేల్రత్న అవార్డుకు ప్రతిపాదిస్తూ అసోం క్రీడాశాఖ కార్యదర్శి దులాల్ చంద్రదాస్ ఈనెల 5న కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీంతో ఈ ఏడాది ఈ అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా హిమ ఘనత వహించింది.
2018లో జరిగిన అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్స్ మహిళల 400మీ. పరుగులో స్వర్ణం గెలిచిన హిమ.. అంతర్జాతీయ స్థాయిలో పసిడి గెలిచిన తొలి ట్రాక్ అథ్లెట్గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల 4×400 మిక్స్డ్, మహిళల 4×400మీ. రిలేల్లో ఆమె బంగారు పతకాలు సొంతం చేసుకుంది. 400మీ. వ్యక్తిగత పరుగులో రజతం నెగ్గింది.
20 ఏళ్ల హిమదాస్ గతేడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ ఛాంపియన్షిప్స్లో పాల్గొని పతకాలు కైవసం చేసుకుంది. 2018లోనే అర్జున అవార్డు అందుకున్న ఆమె ఈ సారి ఖేల్రత్న పురస్కారం కోసం జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, టీటీ క్రీడాకారిణి మనిక బత్రా, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పోటీపడనుంది.
ఓపెనర్ శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మను అర్జున పురస్కారాలకు నామినేట్ చేసిన చేసిన విషయం తెలిసిందే. 2020 ఏడాదికి గాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు వీరి పేర్లను బీసీసీఐ పంపించింది. అరంగేట్రంలోనే అత్యంత వేగవంతమైన టెస్టు సెంచరీ చేసిన రికార్డు శిఖర్ ధావన్కు ఉంది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో వరుసగా రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ పురస్కారం అందుకున్న 'ఒకే ఒక్కడు' గబ్బర్. వన్డేల్లో అత్యంత వేగంగా 2000, 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 4000, 5000 పరుగులు చేసిన భారత రెండో క్రికెటర్ సైతం అతడే కావడం విశేషం. మహిళల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారతీయ క్రికెటర్గా దీప్తి శర్మ రికార్డు సృష్టించింది. తన ఆల్రౌండ్ ప్రతిభతో జట్టుకు అపురూప విజయాలు అందించింది.
సుశాంత్ మృతిపై స్పందించని ధోనీ.. కారణాలు ఇవేనా?!!