ముంబై: ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్ స్పష్టం చేసింది. మరో 24గంటల్లో మొదలుకానున్న ఆసియా క్రీడల్లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడింది. ఆసియా క్రీడల్లో పోటీ తీవ్రంగా ఉంటుందని.. అయితే, పోటీని సమర్థంగా ఎదుర్కొనేందుకు శ్రమిస్తున్నానని తెలిపింది. పతకాలను కైవసం చేసుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అంటోంది.
అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నిర్వహించిన ప్రపంచ అండర్-20 అథ్లెటిక్ చాంపియన్షిప్లో పాల్గొని స్వర్ణ పతకాన్ని అందుకోవడంతో హిమ పేరు దేశంలో మారుమోగిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో పతకాన్ని గెల్చుకున్న తొలి భారత అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించింది.
400 మీటర్ల పరుగులో పీటీ ఉషను గుర్తుకు తెచ్చేలా అత్యంత వేగంగా దూసుకెళ్లే హిమపై అభిమానుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆమె కూడా ఆ స్థాయికి తగినట్టు రాణించేందుకు కృషి చేస్తానని అంటోంది. భారత్కు పతకాలను సాధించిపెట్టడమే తన ధ్యేయమని, అందుకు పూర్తిగా సంసిద్ధమై ఉన్నానని తెలిపింది. ఆసియా క్రీడల్లో ఈసారి భారత్ గతంలో ఎన్నడూ లేనన్ని పతకాలు గెల్చుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
హిమదాస్.. గతేడాది గువాహటి వేదికగా జరిగిన 58వ జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సీనియర్ విభాగంలో 200మీటర్ల రేసులో పాల్గొంది. ఇందులో రికార్డు వేగాన్ని నమోదు చేసి 23.10సెకన్లలో పరుగును పూర్తి చేసింది. తద్వారా ఇండోనేషియా వేదికగా జరగనున్న 2018 ఆసియా క్రీడలకు స్ప్రింటర్గా హిమదాస్ అర్హత సాధించింది.