
హైదరాబాద్: భారత్లో ఈ మధ్యనే క్రీడాదరణ పెరుగుతోంది అనుకుంటున్న తరుణంలో హర్యానా ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్రీడాకారులంతా మండిపడుతున్నారు. రాష్ట్రంలోని క్రీడల అభివృద్ధికి ఆటగాళ్ల దగ్గర్నుంచే డబ్బులు వసూలు చేయడంపై అందరూ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశం ఇదే:
రాష్ట్రంలోని క్రీడాకారులు సంపాదించిన మొత్తంలో మూడో వంతును ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనంటూ హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ డబ్బును రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న క్రీడాకారులు ఎప్పుడైతే.. ప్రొఫెషనల్ స్పోర్ట్స్, కమర్షియల్ ఎండార్స్మెంట్స్లలో పాల్గొంటారో.. ఆ సమయంలో నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో సదరు అథ్లెట్కు అసాధారణ సెలవు (జీతం లేకుండా) ఇస్తారు.
అథ్లెట్లు అలా సంపాదించిన మొత్తంలో మూడో వంతును హర్యానా రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి వినియోగిస్తారట. ఈ విషయాన్ని ఏప్రిల్ 30న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో వెల్లడించారు. ఒకవేళ ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవుపై వెళ్లి ఈవెంట్ లేదా వాణిజ్య ప్రకటనల షూటింగ్లో పాల్గొంటే వాటి ద్వారా వచ్చే సంపాదన మొత్తాన్నీ కూడా.. స్పోర్ట్స్ కౌన్సిల్ దగ్గర డిపాజిట్ చేయాల్సిందేనని కొత్త నిబంధన పెట్టారు.
దీనిపై అథ్లెట్లు తీవ్రంగా మండిపడుతున్నారు.రెజ్లర్, ఒలింపిక్ రజత పతక విజేత అయిన సుశీల్కుమార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇలాంటి ఉత్తర్వులు మొదటిసారిగా చూస్తున్నానని.. ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. మరో రెజ్లర్ బబితా ఫొగాట్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అసలు ఓ అథ్లెట్ ఎంతగా శ్రమిస్తారనే విషయం ప్రభుత్వం గమనిస్తుందా..? సంపాదనలో మూడో వంతు ఇవ్వాలని వాళ్లు ఎలా అడుగుతారు? దీనిని అస్సలు సమర్థించను. ఈ నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం ముందుగా మాతో చర్చించి ఉండాల్సింది' అని బబితా ఫోగట్ మండిపడింది.
గతంలో కూడా హర్యానా ప్రభుత్వం ఇలాంటి వివాదాస్పద నిర్ణయమే తీసుకుంది. రైల్వేలు, ఇతర సంస్థల్లో పనిచేసే క్రీడాకారుల ప్రైజ్ మనీలో కోతపెడతామని ప్రతిపాదించింది.