న్యూఢిల్లీ: వయసు చిన్నదైనా సహాయంలో మాత్రం పెద్దమనసు చాటుకున్నాడు 15 ఏళ్ల భారత యువ గోల్ఫ్ ప్లేయర్ అర్జున్ భాటి. ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్పై పోరాటంలో తాను కూడా భాగమవుతానంటూ అర్జున్ భాటి ముందుకొచ్చాడు. గత ఎనిమిదేళ్లలో తాను సాధించిన 102 ట్రోఫీలను విక్రయించి.. కరోనాపై పోరుకు విరాళాన్ని అందించాడు. పీఎం కేర్స్కు రూ 4.30 లక్షలు సాయం చేసినట్లు తెలిపాడు.
కెరీర్లో ఆ రెండు ఇన్నింగ్స్లే నా ఫేవరెట్: రహానే
జూనియర్ స్థాయిలో మూడుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన అర్జున్ భాటి క్రీడాకారుడిగా గత ఎనిమిదేళ్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 150 టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తాను గెల్చుకున్న 102 ట్రోఫీలను 102 వ్యక్తులకు విక్రయించాడు. ఈ విక్రయాల ద్వారా మొత్తం రూ. 4 లక్షల 30 వేలు వచ్చాయి. ఈ మొత్తాన్ని పీఎం కేర్స్కు విరాళం ఇచ్చాడు. 15 ఏళ్ల వయసులోనే తన గొప్ప మనసు చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇటీవల తెలంగాణకు చెందిన 15 ఏళ్ల షూటర్ ఇషాసింగ్ తాను దాచుకున్న రూ. 30 వేలను ప్రధాన మంత్రి సహాయనిధికి అందజేసిన విషయం తెలిసిందే.
నోయిడా నగరంలోని గ్రేటర్ వ్యాలీ స్కూలులో పదోతరగతి చదువుతున్న అర్జున్ భాటి గోల్ఫ్ క్రీడాకారుడు. కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో తనకు వచ్చిన ట్రోఫీలను తన స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులకు విక్రయించాడు. లాక్డౌన్ ముగిసిన తర్వాత వాళ్లకి అందజేస్తానని అర్జున్ పేర్కొన్నాడు. అర్జున్ భాటి వినూత్న పద్ధతిలో వితరణ మొత్తాన్ని సేకరించడాన్ని అందరూ అభినందించారు. అంతకుముందు అర్జున్ అమ్మమ్మ తన ఏడాది పెన్షన్ మొత్తాన్ని (రూ. 2,06,148) పీఎం కేర్స్ ఫండ్కు విరాళంగా ఇవ్వడం విశేషం.
'ప్రస్తుతం దేశం ఎంతో కఠిన సమయంను ఎదుర్కొంటోంది. ఇది సంక్షోభ పరిస్థితి. దేశానికి సాధ్యమైనంత సాయం చేయాలని భావించాను. గత 8 ఏళ్లలో 102 ట్రోఫీలు గెలిచా. అవి అమ్మడం ద్వారా వచ్చిన రూ.4.30 లక్షలను పీఎంకేర్స్కు విరాళంగా ఇచ్చా. వ్యక్తిగతంగా నా వద్ద ఎటువంటి డబ్బు లేదు. అందుకే ట్రోఫీలు విక్రయించాలని నిర్ణయించుకున్నా. దేశానికి సాయం అవసరమైన సమయంలో ఖాళీగా కూర్చోలేను. ట్రోఫీలను భవిష్యత్తులో కూడా సంపాదించుకోవచ్చు. మనం అందరం మహమ్మారిపై విజయం సాధించాలి' అని అర్జున్ అన్నాడు.