|
బెంగళూరు గోల్ఫర్ కొత్త చరిత్ర..
బెంగళూరుకు చెందిన ఈ 23 సంవత్సరాల గోల్ఫర్ తొలిసారిగా ఒలింపిక్స్లో పాల్గొన్నారు. మహిళల వ్యక్తిగత స్ట్రైకింగ్ గోల్ఫ్ ఈవెంట్కు ప్రాతినిథ్యాన్ని వహించారు. చివరిదైన నాలుగో రౌండ్లో సత్తా చాటారు. నాలుగో రౌండ్ ఆరంభంలో రెండో స్థానంలో నిలిచారు. తోటి ప్రత్యర్థులు విజృంభించడంతో మూడో స్థానానికి పడిపోయారు. ఆ తరువాత తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. చాలా సేపటి వరకు మూడో స్థానంలో కొనసాగారు. అదే సమయంలో న్యూజిలాండ్కు చెందిన లైడియా కో దూసుకొచ్చారు. టాప్-3లో నిలిచారు. ఈ దశలో తుఫాన్ హెచ్చరికలు జారీ కావడంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది.
|
పోటీ ఇచ్చిన న్యూజిలాండ్..
ఆట మళ్లీ మొదలైన కొద్దిసేపటికే లైడియా తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకున్నారు. న్యూజిలాండ్ గోల్ఫర్ లైడియా చివరి బర్డీ సాధించారు. దీనితో ఒక్క పాయింట్ తేడాతో ఆదితి అశోక్.. నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఈవెంట్లో అరంగేట్రంలోనే పతకం అంచుల దాకా వెళ్లిన తొలి మహిళా గోల్ఫర్గా ఆదితి అశోక్ చరిత్ర సృష్టించారు. ఇప్పటిదాకా గోల్ఫ్లో ఎవరూ ఈ స్థానానికి ఎగబాకలేదు. అలాంటి అరుదైన స్థానాన్ని దక్కించుకోగలిగారు ఆదితి అశోక్.
|
లిస్ట్ పెద్దదే..
కాగా- ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటిదాకా నాలుగో స్థానంలో నిలిచి.. వెంట్రుకవాసిలో పతకాన్ని కోల్పోయిన భారత అథ్లెట్ల జాబితా కాస్త పెద్దదే. ఈ లిస్టులో తాజాగా ఆదితి అశోక్ చోటు సంపాదించారు. లెజెండ్ల సరసన నిలిచారు. ఆమె కంటే ముందు- ఫ్లయింగ్ సిఖ్గా గుర్తింపు పొందిన అథ్లెట్లు మిల్కాసింగ్, పీటీ ఉష, గురుచరణ్ సింగ్, టెన్నిస్ ద్వయం లియాండర్ పేస్/మహేష్ భూపతి, జోయ్దీప్ కర్మాకర్, దీపా కర్మాకర్, సానియా మిర్జా/రోహన్ బొపన్న ఈ లిస్ట్లో ఉన్నారు. వీరంతా తమ కేటగిరీకి సంబంధించిన ఈవెంట్లల్లో నాలుగో స్థానంలో నిలిచారు. తృటిలో పతకాన్ని కోల్పోయారు.
|
పతకంపై చివరివరకూ ఆశలు..
ఫైనల్ రౌండ్ ముగిసేలోగా ఆదితి అశోక్ తన స్థానాన్ని ఏ మాత్రం మరింత మెరుగుపర్చుకున్నా భారత్కు మరో మెడల్ ఖాయం అయ్యేదే. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం ఖాతాలో చేరిపోయుండేదే. గోల్ఫ్ ఈవెంట్ చివరిదైన నాలుగో రౌండ్ రసవత్తరంగా కొనసాగుతోండగా.. వరుణ దేవుడు అడ్డుపడ్డాడు. పెను తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గోల్ఫ్ ఈవెంట్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫీల్డ్ నుంచి గోల్ఫర్లందరూ క్లబ్ హౌస్కు చేరుకున్నారు. వర్షం కూడా పడటం ఆరంభమైంది. కొద్దిసేపటి కిందటే ఈవెంట్ మళ్లీ ఆరంభమైనప్పటికీ.. ఆదితి తన ఏకాగ్రతను కోల్పోయినట్టయింది. ఆ వెంటనే నాలుగో స్థానానికి దిగజారారు. కన్ను మూసి తెరిచే లోపే పతకం చేజార్చుకున్నారు.
|
మెడల్ కోల్పోయినా..
పతకం అంచుల దాకా వెళ్లిన ఆదితి అశోక్పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎవ్వరూ కూడా పెద్దగా పట్టించుకోని గోల్ఫ్ ఈవెంట్పై అందరి దృష్టి మళ్లించేలా చేశారంటూ నెటిజన్లు ప్రశంసిస్తోన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ శాఖ సహాయమంత్రి నితీష్ ప్రామాణిక్.. తదితరులు ఆదితి అశోక్పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. భవిష్యత్తులో అద్భుతంగా రాణించాలంటూ అకాంక్షించారు. గోల్ఫ్ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారంటూ కితాబిచ్చారు.