మట్టిలో మాణిక్యం ప్రణతి..
పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఉన్న కర్కాయ్ అనే చిన్న గ్రామం ఇప్పుడు టోక్యోలో వినిపిస్తోంది. ఆ గ్రామం నుంచి ఒలింపిక్స్లో భారత్ తరపున జిమ్నాస్టిక్స్లో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రణతి నాయక్ కారణం. అవును భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్ విభాగంగలో పాల్గొంటున్న ఏకైక మహిళా క్రీడాకారిణి ప్రణతి నాయక్. ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతోంది.
చిన్నతనం నుంచే...
ప్రణతి నాయక్ చిన్నతనం నుంచే క్రీడలపై పట్టు ఉండేదని ఆమె తల్లిదండ్రులు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. స్కూలుకు వెళ్లే సమయంలోనే ఈ ప్రణతి ఆక్రోబాటిక్స్ చేసేదని చెప్పారు. స్కూలులో నిర్వహించే క్రీడాపోటీల్లో చురుకుగా పాల్గొని మెరుగైన ప్రదర్శన ఇచ్చి చాలా మెడల్స్ గెల్చుకుందని ప్రణతి తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. ఇక స్కూలు స్థాయి నుంచి బ్లాక్ స్థాయికి, అక్కడి నుంచి జిల్లా మరియు రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్లో పాల్గొని ఎన్నో మెడల్స్ గెల్చుకుందని ప్రణతి తండ్రి శ్రీమంత నాయక్ చెప్పారు.
ఎన్నో పతకాలు సాధించినప్పటికీ...
ఎన్నో మెడల్స్, మరెన్నో బహుమతులు పొందిన ప్రణతి నాయక్కు సరైన గుర్తింపు దక్కలేదు సరికదా జాతీయ స్థాయిలో పోటీచేసేందుకు మార్గం కూడా కనిపించలేదు. ఎలాగో అలాగా 2013- 14వ సంవత్సరంలో జరిగిన జాతీయస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించడంతో అందరూ ప్రణతి ఎవరా అని ఆరా తీశారు. అప్పుడే ప్రణతిపై దేశం దృష్టి పడిందని తండ్రి శ్రీమంత నాయక్ చెప్పారు. ఇక అక్కడి నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందటం ప్రారంభించిందని చెప్పుకొచ్చాడు.
|
గ్రామీణ భారతంలో శిక్షణా శిబిరాలు..
"కర్కాయ్ గ్రామంలో జిమ్నాస్టిక్స్లో శిక్షణ పొందేందుకు సరైన వనరులు లేవు. వెస్ట్ మిడ్నాపూర్లో కూడా లేకపోవడంతో కోల్కతాకు వెళ్లి శిక్షణ పొందాల్సి వచ్చేది. గ్రామీణ ప్రాంతాల వారికి కూడా శిక్షణ పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గ్రామీణ భారతంలో ఎంతో మంది టాలెంట్ కలిగిన క్రీడాకారులున్నారు" అని శ్రీమంత నాయక్ అన్నారు. తాను బస్సు డ్రైవర్గా పనిచేస్తూ కనుచూపు సరిగ్గా లేకపోవడంతో మానేసినట్లు చెప్పాడు. అయితే ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటుంది తన కూతురు ప్రణతి అని చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు.
జూలై 25న ప్రణతికి అసలైన సవాలు
సాధారణంగా ఆడపిల్ల ఎదగగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తుంటారని అది చాలా తప్పని చెప్పారు ప్రణతి నాయక్ తల్లి ప్రతిభా దేవి. తన ముగ్గురు కుమార్తెలు బాగా చదువకున్నారని వారికి ఏ రంగంలో రాణించాలంటే ఆ రంగం వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు ప్రతిభా దేవి. ప్రణతి నాయక్కు స్పోర్ట్స్ అంటే ఇష్టమని అందుకే ఆమెను ప్రోత్సహించినట్లు చెప్పారు.
2016 రియో ఒలింపిక్స్లో భారత్ నుంచి దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్లో పాల్గొని నాల్గవ స్థానంలో నిలిచి తృటిలో మెడల్ కోల్పోయింది. ఇక 2021లో అందరి కళ్లు ప్రణతి నాయక్ పై ఉన్నాయి. దేశం యావత్తు జూలై 25 కోసం టీవీల ముందు కూర్చోనుంది. ఎందుకంటే ఆరోజే ప్రణతి నాయక్ తొలి ఛాలెంజ్ను ఎదుర్కోనుంది. తప్పకుండా మెడల్ సాధిస్తుందన్న విశ్వాసంను తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. మనం కూడా ప్రణతికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఆల్ ది బెస్ట్ ప్రణతి..