గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించిన గుత్తా జ్వాలా భారత్లో డబుల్స్ పైన వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్స్ క్రీడాకారిణిలకు ఎక్కువ గుర్తింపు ఇస్తున్నారని విమర్శించింది. బాడ్మింటన్లో సింగిల్స్కు ఉన్నంత గుర్తింపు డబుల్స్ విభాగానికి లేదని వాపోయింది.
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అశ్వినీ పొన్నప్పతో కలిసి రజత పతకాన్ని గెల్చుకున్న జ్వాల గుత్తా అనంతరం తన ఆవేదన వ్యక్తం చేసింది. సింగిల్స్ ఆడే వారికే దేశంలో ప్రధాన్యత లభిస్తున్నదని, డబుల్స్ విభాగంలో పోటీపడే క్రీడాకారిణులను ఎవరూ పట్టించుకోవడం లేదంది.
తగినంత ఆర్థిక సాయంగానీ, గుర్తింపుగానీ లభించని కారణంగా యువతరం డబుల్స్ విభాగంలో ఆడేందుకు వెనుకంజ వేస్తున్నదని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడింది. తమకు గుర్తింపు మినహా దేశ ప్రజల నుంచి మరేమీ అవసరం లేదని చెప్పింది. సింగిల్స్ క్రీడాకారిణికి 10 డాలర్లు లభిస్తే, డబుల్స్ క్రీడాకారిణికి దక్కేది రెండు డాలర్లు మాత్రమేనని, డబుల్స్ విభాగం వివక్షకు గురవుతున్నదని చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమేనని ఆమె అన్నది.
తగినంత గుర్తింపు లభిస్తే డబుల్స్ విభాగంలో ఆడేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపురని అన్నది. తమ ప్రదర్శనకు దరిదాపులకు కూడా రాని సింగిల్స్ క్రీడాకారిణికి విమానాశ్రయంలో ఘన స్వగతం పలికారని, డబుల్స్కు గుర్తింపునివ్వక పోవడం వల్ల కొత్తవాళ్లు ఇటు రావడం లేదన్నది. తమను విమానాశ్రయంలో పట్టించుకున్న వాళ్లే లేరని వాపోయింది.