హైదరాబాద్: జిమ్నాస్టిక్స్కి అంతగా ప్రాధాన్యం లేని భారత్ నుంచి దీపా కర్మాకర్ లాంటి జిమ్నాస్ట్ రావడం గొప్ప విశేషమని రియో ఒలింపిక్స్లో బంగారు పతక విజేత సిమోన్ బైల్స్ అభిప్రాయపడింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో సిమోన్ మాట్లాడుతూ 'దీపాకర్మాకర్ చాలా టాలెంట్. ఆమె చేసిన ప్రమాదకరమైన ప్రొడునోవా విన్యాసం నేను చచ్చినా చేయను' అని చెప్పింది.
రియో ఒలింపిక్స్లో సిమోన్ బైల్స్ నాలుగు బంగారు పతకాలను సాధించిన సంగతి తెలిసిందే. రియోలో ఉన్నప్పుడు తాను ఆమెతో ఎక్కువగా మాట్లాడలేకపోయానని, కానీ రాబోయే కాలంలో జిమ్నాస్ట్లకు దీపా స్ఫూర్తినిస్తుందని, ఈ క్రీడకు దేశంలో ఆమె పర్యాయపదంగా నిలవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పింది.
దీపా కర్మార్కర్ ప్రొడునోవా చేయాలనుకోవడమే గొప్ప సాహసమని అభివర్ణించింది. అయితే అలాంటి విన్యాసం తాను మాత్రం ఎప్పటికీ చేయబోనని ఆమె తేల్చి చెప్పింది. జిమ్నాస్టిక్స్ లాంటి క్రీడల్లో ఒక్కొక్కరికి ఒక్కో విన్యాసం కుదురుతుందని, ఎవరికి నప్పేది వాళ్లు మాత్రమే చేయగలరని పేర్కొంది.
ప్రొడునోవా విన్యాసం తనకు రాదని తేల్చి చెప్పింది. వాల్ట్ ఆఫ్ డెత్ అన్న పేరు పొందిన ప్రొడునోవా విన్యాసం జిమ్నాస్టిక్స్లో చాలా ప్రమాదకరమైన విన్యాసం. ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన ఈ విన్యాసంలో ఏ కొంచెం తేడా వచ్చినా మెడకి తీవ్రమైన గాయం అవుతుంది. అంతేకాదు ఒక్కోసారి ప్రాణం కూడా పోవచ్చు.
1990వ దశకంలో పేరొందిన రష్యన్ ఛాంపియన్ ఎలెనా ప్రొడునోవా పేరునే ఈ విన్యాసానికి పెట్టారు. 19 ఏళ్ల సిమోన్ బైల్స్ రియో ఒలింపిక్స్లో నాలుగు బంగారు, ఓ కాంస్య పతకం గెలుచుకుని ఒకే ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు గెలుచుకున్న తొలి అమెరికన్ జిమ్నాస్ట్గా రికార్డు సృష్టించింది.