ఒలింపిక్ అర్హత హోదాను రద్దు చేసిన ఐఓసీ
అంతేకాదు భారత్ ఆతిథ్యమిచ్చే వరల్డ్కప్ షూటింగ్లో పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ ఈవెంట్కు ఒలింపిక్ అర్హత హోదాను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు భవిష్యత్లో అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్తో చర్చలను నిలిపివేయాలని ఐఓసీ నిర్ణయించింది.
ఒలింపిక్ ఛార్టర్ విధివిధానాలకు వ్యతిరేకంగా భారత్
ఒలింపిక్ ఛార్టర్ విధివిధానాలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ప్రవర్తించిందని ఐఓసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అథ్లెట్ల మధ్య ఆతిథ్య దేశం ఎలాంటి వివక్ష చూపించకూడదని, ఆ దేశ రాజకీయ జోక్యం కూడా ఉండరాదని ఒలింపిక్ కమిటీ సూచించింది. అయితే, భారత్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్లే ఆ దేశంతో చర్చలు నిలిపివేసేందుకు నిర్ణయించినట్లు పేర్కొంది.
క్రీడల్లో వివక్షకు తావులేదు
ఈ మేరకు అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) అధ్యక్షుడు వ్లాదిమిర్ లిసిన్ గురువారం వెల్లడించారు. "ఢిల్లీ ఈవెంట్లో ఒలింపిక్స్ కోటా రద్దు చేసినట్లు ఐఓసీ తెలిపింది. క్రీడల్లో వివక్షకు తావులేదని చెప్పింది. ఇక్కడ కేటాయించిన 16 ఒలింపిక్స్ బెర్తుల్ని మరో ప్రపంచకప్కు తరలించింది. ఐఓసీలో భాగమైన మేం కమిటీ ఆదేశాలను పాటించక తప్పదు" అని లిసిన్ తెలిపారు.
శుక్రవారం నుంచి ఢిల్లీలో వరల్డ్కప్ షూటింగ్
శుక్రవారం నుంచి ఢిల్లీలో వరల్డ్కప్ షూటింగ్ ప్రారంభం కానుంది. పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్ షూటర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించిన సంగతి తెలిసిందే.