ఆదివారం మూడు పతకాలు సాధించిన భారత్:
10 మీటర్ల ఎయిల్ పిస్టల్ విభాగంలో ఆదివారం భారతకు మూడు పతకాలు దక్కాయి. మహిళల విభాగంలో షూటర్ మనూ భాకర్ స్వర్ణం పతకం దక్కించుకోగా, హీనా సిద్ధూ రజతంతో సరిపెట్టుకుంది. ఇక పురుషుల విభాగంలో రవికుమార్ కాంస్యం దక్కించుకున్నాడు. పట్టుమని పదహారేళ్లు కూడా నిండని హరియాణా షూటర్ మనూ భాకర్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న మొదటిసారే బంగారు పతకం గెలుచుకోవడం విశేషం.
మనూ బాకర్ స్పోర్ట్స్ అవార్డులు:
ఈ విభాగంలో మన దేశానికే చెందిన సీనియర్ షూటర్ హీనా సిద్ధూను వెనక్కు నెట్టి పసిడి నెగ్గింది. ఫైనల్లో మొత్తం 240.9 పాయింట్లు సాధించిన మనూ, సీనియర్ షూటర్ హీనా కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. గత ఫిబ్రవరిలో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన స్పోర్ట్స్ అవార్డులు 2017లో మనూ బాకర్ ఉత్తమ షూటర్ అవార్డును గెలుచుకున్నారు.
వరుసగా మూడో పతకం:
మరోవైపు షూటర్ హీనా సిద్ధూ కామన్వెల్త్లో వరుసగా మూడో పతకం సాధించింది. ఢిల్లీ వేదికగా సాగిన 2010 క్రీడల్లో స్వర్ణం సాధించిన హీనా, 2014లో రజతం, 2018లోనూ రజతం గెలుపొందింది. క్వాలిఫైయింగ్ రౌండ్లో 400 పాయింట్లకు గానూ 379 పాయింట్లు సాధించి ఫైనల్కు అర్హత సాధించిన హీనా సిద్ధూ, మెరుగైన ఆటతీరుతో మనూ భాకర్కు చేరువైంది.
రజత పతకం సాధించిన హీనా సిద్దూ మొత్తం 234 పాయింట్లు సాధించారు.
తక్కువ కాలంలోనే టీనేజర్ సంచలనం:
క్వాలిఫైయింగ్ రౌండ్లో 400 పాయింట్లకు గానూ 388 పాయింట్ల సాధించిన మనూ, ఈ రౌండులో కామన్వెల్త్ క్రీడల రికార్డులను తిరగరాశారు. రెండేళ్ల కిందటే షూటింగ్లోకి అడుగుపెట్టిన ఈ టీనేజర్ సంచలనం తక్కువ కాలంలోనే తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్- 2018 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని, అతి తక్కువ వయసులో స్వర్ణం సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డులకెక్కారు.
భారత బాక్సర్ మేరీకోమ్:
ఇక బాక్సింగ్ 45-48 కిలోల విభాగంలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ సెమీస్కు చేరింది. దీంతో భారత్కు కనీసం కాంస్య పతకం ఖాయమైనట్లే. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు వెయిట్లిఫ్టర్లే పతకాల సాధించగా, షూటర్లు కూడా వేట మొదలుపెట్టారు. వెయిట్ లిఫ్టర్లు ఇచ్చిన స్ఫూర్తితో పతకాల వేట షురూ చేశారు.