
హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత రెజ్లర్లు స్వర్ణాలతో ఖాతాలు నింపుకుంటున్నారు. గురువారం స్వర్ణంతో మొదలుపెట్టిన రాహుల్ అవారే, తర్వాత సుశీల్ కుమార్ గెలుచుకోగా శుక్రవారం బజరంగ్ పూనియా మరోసారి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల 65కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో టాప్గా నిలిచి స్వర్ణాన్ని సాధించాడు.
బౌట్ మొదలైనప్పటి నుంచి ఆధిక్యం ప్రదర్శించిన పూనియా చారిగ్ కేన్పై 10-0 లీడింగ్ స్కోరు సాధించాడు. ఇదంతా కేవలం ఒక్క నిమిషం పాటు జరిగిన ఆటే. ప్రత్యర్థిని చిత్తు చేసిన తీరును చూసి అక్కడ ఉన్నవాళ్లంతా హర్షం వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత జరిగిన బౌట్ లో మహిళల 57కేజీల విభాగంలో పూజా దండా నైజీరియాకు చెందిన ఒడునాయో అడెకురొయెను చిత్తు చేసి వెండి పతకాన్ని గెలుచుకుంది.
ఇదిలా ఉంటే, దివ్యకరణ్ నైజీరియాకు చెిందిన ఒబొరుదుడుతో పోటీ సెమీఫైనల్స్లో పరాజయం పాలైంది. పూనియా సాధించిన స్వర్ణంతో భారత్ ఖాతాలోకి రెజ్లింగ్ విభాగంలో మూడో స్వర్ణం కాగా, సుశీల్ కుమార్కూ ఇది మూడో స్వర్ణమే. రాహుల్ అవారెకు ఇది రెండో స్వర్ణం. అతను తొలి స్వర్ణ పతకాన్ని 2011 కామన్వెల్త్ గేమ్స్లో సాధించాడు.
ఈ ఒక్క రోజుతోనే భారత్ ఐదు పతకాలు పైగా సాధించింది. బజరంగ్ పూనియా సాధించిన స్వర్ణంతో కలిపి భారత్ చేతిలో 17 స్వర్ణాలు, 8 రజితాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ కామన్వెల్త్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.