
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. లిఫ్టర్లు, షూటర్లను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. గురువారం జరిగిన పోటీల్లో భారత వెటరన్ రెజ్లర్ సుశీల్ కుమార్ స్వర్ణం గెలిచాడు.
74 కేజీల ఈవెంట్లో సుశీల్ కుమార్ తన ప్రత్యర్థిని కేవలం 80 సెకన్లలో ఓడించడం విశేషం. ఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన జోహనెస్ బోథాపై సుశీల్ విజయం సాధించాడు. తాజా పతకంతో భారత ఖాతాలో మొత్తం 14 స్వర్ణాలు చేరాయి. మొత్తంగా చూస్తే భారత్కు ఇది 29వ పతకం.
తాజా విజయంతో సుశీల్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఒలింపిక్స్లో వెండి, రజతం... వరల్డ్ చాంపియన్షిప్స్లో స్వర్ణం, కామన్వెల్త్ గేమ్స్లో మూడు స్వర్ణాలు, ఏషియన్ గేమ్స్లో స్వర్ణం గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 28 పతకాలతో భారత్ మూడోస్థానంలో కొనసాగుతోంది.
స్వర్ణం సాధించిన సుశీల్కు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపాడు. 'భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం సాధించాడు. కంగ్రాట్స్ సుశీల్. ఫైనల్స్లో సుశీల్ కేవలం 80 సెకన్లలోనే తన విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. నిన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
అంతకముందు రెజ్లింగ్ 57 కేజీల ప్రీస్టైల్ ఈవెంట్లో భారత్కు చెందిన రాహుల్ ఆవారె స్వర్ణ పతకం గెలిచాడు. ఫైనల్లో కెనడాకు చెందిన స్టీవెన్ తకహషిపై 15-7 తేడాతో విజయం సాధించాడు. ఈ మ్యాచ్లో తొలి పీరియడ్లో 6-4, రెండో పీరియడ్ తర్వాత 9-6తో లీడ్లో ఉన్న రాహుల్.. చివరి పీరియడ్లో మరింత చెలరేగి 15-7తో విజయం సాధించాడు.
ఇండియాకు ఇది 13వ గోల్డ్ మెడల్. స్వర్ణం గెలుచుకున్న రాహుల్ జాతీయ గీతం ఆలపించే సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు. రాహుల్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం, 2011 కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇక, మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో బబితా కుమారి రజతం సాధంచింది. మహిళల 76 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో కిరణ్ కాంస్యం దక్కించుకుంది. మార్షిషస్ ప్లేయర్ను చిత్తు చేసి కాంస్యం సాధించింది. భారత్ ఖాతాలోకి 14 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్యాలు చేరాయి. మొత్తం 29 పతకాలతో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా(147), ఇంగ్లాండ్ (79) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.