20ఏళ్ల లక్ష్య సేన్ బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్లో స్వర్ణం సాధించి భారత గోల్డ్ మెడళ్ల సంఖ్య 20కు చేర్చాడు. మలేషియాకు చెందిన ఎన్జీ జే యోంగ్పై అద్భుతంగా పోరాడి గెలుపొందాడు. మలేషియాకు చెందిన యోంగ్ చేతిలో 19-21తో ఓపెనింగ్ సెట్ కోల్పోయినప్పటికీ.. లక్ష్య సేన్ అద్భుతంగా చివరి రెండు సెట్లలో పుంజుకుని ఆడాడు. రెండో సెట్లో కూడా 8-9తో లక్ష్య సేన్ వెనుకబడ్డాడు. అయితే గంటకు పైగా హోరాహోరీగా సాగిన ఫైనల్లో లక్ష్యసేన్ అందుకున్న లయ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
అతను రెండో సెట్లో వరుసగా 13పాయింట్లను సాధించి ఆ సెట్ కైవసం చేసుకున్నాడు. ఇక మూడో సెట్ కూడా అప్రతిహత పోరాటంతో గెలుపొంది చరిత్ర నెలకొల్పాడు. అతని ఆటను చూస్తే సగటు భారత అభిమాని సలామ్ కొట్టాల్సిందే. ఒక్కో షాట్లో అకుంఠిత కసి.. గెలుపు కోసం అలుపును లెక్క చేయలని పట్టుదల చూస్తే వాహ్ అనాల్సిందే. అతను ఫైనల్లో 19-21, 21-9, 21-16 సెట్ల విజయాలతో గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
ప్రపంచ ఛాంపియన్షిప్లలో కాంస్యం గెలుచుకున్న లక్ష్య సేన్.. కామన్వెల్త్ గేమ్స్లో సింగిల్స్లో స్వర్ణం సాధించిన భారతీయ మెన్స్ జాబితాలో ప్రకాష్ పదుకొణె (1978), పారుపల్లి కశ్యప్ (2014), సయ్యద్ మోదీ (1982)ల సరసన చేరాడు. పీవీ సింధు తన తొలి సింగిల్స్ గోల్డ్ మెడల్ గెలిచిన గంట తర్వాత లక్ష్య సేన్ సైతం గోల్డ్ మెడల్ గెలవడంతో బ్యాడ్మింటన్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతుంది. ఎడమ చీలమండ గాయంతో పట్టీ కట్టుకుని మరీ ఆడిన సింధు ఫైనల్లో ఎలాంటి తడబాటు లేకుండా విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.