హైదరాబాద్: తనను హాస్టల్ వార్డెన్ అని సంభోదించి పరువు తీశారని చెరుకూరి వోల్గా ఆర్చరీ సెంటర్ నిర్వాహకుడు చెరుకూరి సత్యనారాయణ అన్నారు. అర్జున అవార్డు సాధించినందుకు జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ. కోటి నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది. అందులో రూ.15 లక్షలను కోచ్ చెరుకూరి సత్యనారాయణకు ఇచ్చేలా శాప్ అధికారులు జీవో జారీ చేశారు.
తనకు ప్రకటించిన ప్రోత్సాహకంలో కోత విధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై జ్యోతి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన ప్రతిభను మెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.కోటి ప్రోత్సాహకంగా ఇస్తే, శాప్ అధికారులు అందులో రూ.15 లక్షలను కోచ్కు ఇచ్చేలా జీవో జారీ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.
శాప్ వేధింపులు: ఆర్చర్ జ్యోతి సురేఖ దీక్ష, ప్రభుత్వం దిగొచ్చి చర్చలు
ఈ విషయమై జ్యోతి సురేఖ మాట్లాడుతూ 2013లోనే చెరుకూరి సత్యనారాయణకు చెందిన ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చింది. చెరుకూరి తనకు కోచ్ కాదని.. ఆయన కేవలం వార్డన్ మాత్రమేనని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలపై సోమవారం చెరుకూరి సత్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడాడు.
తాను అడగని డబ్బులకు అడిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను హాస్టల్ వార్డెన్ అని సంభోదించి పరువు తీశారని చెప్పారు. ఆమె మాటలు ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని అన్నారు. తన మీద చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు చెప్పి రాద్ధాంతం చేస్తే ప్రభుత్వం సురేఖకు ఇవ్వాల్సిన ఉద్యోగం, ఇంటి స్థలం, డబ్బులు ఇస్తుందని ఈ డ్రామా నడిపించారని అన్నారు.
2007 నుంచి 2013 మార్చి వరకు మా అకాడమీలో జ్యోతి సురేఖ శిక్షణ తీసుకుందని, నా కుమారుడు చనిపోయిన తర్వాత అకాడమీ సురేఖది అన్నట్లు సురేఖ తండ్రి ప్రవర్తించేవాడని ఆయన తెలిపారు. జ్యోతి సురేఖ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తరపున ఆడటం లేదని, పెట్రోలియం శాఖ తరపున ఆడుతోందని ఆయన పేర్కొన్నారు.
అటువంటి సురేఖకు ఏపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తన అకాడమీలో శిక్షణ తీసుకుని తననే కోచ్ కాదని చెప్తోందని మండిపడ్డారు. గురువును అవమానించడం సురేఖకు తగదన్నారు. తమకు క్షమాపణ చెప్పే వరకు తన కుమారుడి సమాధి దగ్గర నిరసన దీక్ష చేస్తానని తెలిపారు.