గుండెపోటుతో రాయ్ మృతి:
జీవితకాల సాఫల్య విభాగంలో ఈ ఏడాది ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన పురుషోత్తం రాయ్.. శనివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోవాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా తొలిసారి వర్చువల్ కార్యక్రమం ద్వారా అవార్డు ప్రదానోత్సవం జరగనున్న నేపథ్యంలో.. దీనికోసం నిన్న (శుక్రవారం) నిర్వహించిన డ్రెస్ రిహార్సల్స్లో సైతం ఆయన పాల్గొన్నారు. అయితే శుక్రవారం సాయంత్రం ఉన్నట్టుండి ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు.
కిరణ్ రిజిజు విచారం:
పురుషోత్తమ్ రాయ్ మృతిపై క్రీడామంత్రి కార్యాలయం ట్విటర్ వేదికగా స్పందించింది. 'భారత ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్ శ్రీ పురుషోత్తం రాయ్ శుక్రవారం కన్నుమూశారు. ఈరోజు వర్చువల్గా జరిగే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ద్రోణాచార్య (జీవితకాల) పురస్కారం అందుకోవాల్సి ఉంది. ఆయన మృతిపట్ల కిరణ్ రిజిజు విచారం వ్యక్తం చేశారు' అని పేర్కొంది. ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని రిజిజు పేర్కొన్నట్టు వెల్లడించింది.
విషాధకరమైన సంఘటన:
'ఇది ఏఎఫ్ఐకి ఒక విషాధకరమైన సంఘటన. పురుషోత్తమ్ రాయ్ మరణంతో దిగ్ర్భాంతికి గురయ్యాం. అథ్లెటిక్స్ కోసం తన జీవితమంతా పని చేశారు. భారతీయ అథ్లెటిక్స్ ఎనలేని కృషి చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిజేస్తున్నాం' అని ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా అన్నారు. 'రాయ్ ఒక మంచి కోచ్. ఆయన కింద పలువురు అగ్రగ్రేణి భారత అథ్లెట్లు శిక్షణ పొందారు. అవార్డు అందుకోవడానికి ఒక రోజు ముందు ఇది చాలా విషాదకరమైన సంఘటన' అని మాజీ లాంగ్ జంపర్ అంజు బూబీ జార్జ్ పేర్కొన్నారు.
1974లో కోచింగ్ కెరీర్:
నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి డిప్లోమా అందుకున్న రాయ్.. 1974లో కోచింగ్ కెరీర్ ప్రారంభించారు. 1987 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్, 1988 ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్ షిప్స్, 1999 ఎస్ఏఎఫ్ గేమ్స్ కోసం కూడా రాయ్ భారత జట్టుకు కోచ్గా పని చేశారు. వందనా రావు, ప్రమీలా అయ్యప్ప, అశ్విని నాచప్ప, మురళి కుట్టన్, ఎంకే ఆశా, ఈబీ షైలా, రోసా కుట్టి, జీజీ ప్రమీలా లాంటి ఎంతోమంది టాప్ అథ్లెట్లు ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్నవారే.