హైదరాబాద్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం అందించిన హిమదాస్ లాంటి అద్భుత ప్రతిభ కలిగిన అథ్లెట్ను పరిచయం చేసిన కోచ్ నిపన్ దాస్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని నిపన్ దాస్ దగ్గర శిక్షణ పొందిన ఓ క్రీడాకారిణి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
అస్సాం రాజధాని గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఎంతో మంది అథ్లెట్లకు నిపన్దాస్ శిక్షణ ఇస్తున్నాడు. అయితే మే నెలలో తనను లైంగికంగా బాధించాడని ఆరోపణలు చేస్తూ గత నెల 22న సదరు క్రీడాకారిణి స్థానిక పోలీస్స్టేషన్లో నిపన్ దాస్పై ఫిర్యాదు చేసింది.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతడిని విచారించారు. ఈ నేపథ్యంలో అతడు శనివారం మీడియాతో మాట్లాడుతూ "ఆమె చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, కల్పితమైనవి. ఆమె కంటే వేగంగా పరిగిత్తే అథ్లెట్లు నా దగ్గర శిక్షణ పొందుతున్నారు" అని తెలిపాడు.
"జూన్ 26-29 మధ్య గౌహతిలో జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. 100 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో నా వద్ద శిక్షణ తీసుకుంటున్న ఆమెను ఈ పోటీలకు ఎంపిక చేయలేదు. అది దృష్టిలో పెట్టుకునే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తోంది" అని అన్నాడు.
"ఆమె కంటే మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు నేను అవకాశం ఇచ్చాను. ఇందులో తప్పేముంది. మే 18న నేను ఆమెపై దాడికి పాల్పడినట్లు చెబుతోంది. మరి ఇన్నాళ్ల తర్వాత జులై 22న పోలీసులకు ఫిర్యాదు చేయడంలో అర్థం ఏమిటి" అని తెలిపాడు.
"ప్రస్తుతం పోలీస్ విచారణ కొనసాగుతున్నది. నాతో పాటు సహాయక కోచ్లు, కొంత మంది అథ్లెట్లను వారు విచారణ చేశారు. దర్యాప్తులో ఎలాంటి మచ్చలేకుండా బయటపడుతానన్న నమ్మకం నాకుంది" అని నిపన్ దాస్ అన్నాడు.