కోల్కతా: ఆసియా గేమ్స్లో మూడు స్వర్ణాలు సాధించడమే భారత ఆర్చరీ ముందున్న ప్రధాన లక్ష్యమని చీఫ్ కోచ్ జీవన్జ్యోత్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆసియా గేమ్స్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా భారత ఆర్చరీ చీఫ్ కోచ్ జీవన్జ్యోత్ సింగ్ మాట్లాడుతూ "2014లో అభిషేక్ వర్మ (రజితం), త్రిషాదేవ్ (కాంస్యం)లు వ్యక్తిగత విభాగంలో పతకాలు సాధించారు. ఈసారి ఆ అవకాశం లేకపోవడం భారత్కు నష్టమే" అని అభిప్రాయపడ్డాడు.
"కానీ, ఈసారి గ్రూప్ ఆర్చర్లు మంచి ఫామ్లో ఉన్నారు. అంత్యాల, బెర్లిన్ వరల్డ్ కప్ స్టేజ్లో మహిళా జట్టు రెండు రజితాలు సాధించి ప్రపంచ టాప్ ర్యాంకుకు చేరింది. షాంఘై, అంత్యాల, సాల్ట్ లేక్, బెర్లిన్ వరల్డ్ కప్ ప్రతి స్టేజ్లోనూ భారత మిక్స్డ్ డబుల్స్ జట్టు వర్మ, జ్యోతి సురేఖ పతకాలు సాధించారు" అని సింగ్ అన్నారు.
"మూడు విభాగాల్లోనూ ఈసారి భారత విలుకాళ్లు స్వర్ణ పతకాలు సాధించగలరన్న నమ్మకం ఉంది" అని సింగ్ వ్యాఖ్యానించాడు. 2014 ఆసియా గేమ్స్ నాలుగు విభాగాల్లో భారత ఆర్చర్లు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఈసారి పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగాల స్థానంలో మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో భారత్ పాల్గొంటోంది. ప్రస్తుతం భారత ఆర్చరీ జట్టు రెండుసార్లు వరల్డ్కప్ ఫైనల్ స్వర్ణ పతక విజేత సెర్గియో ఫగ్ని గైడెన్స్లో శిక్షణ పొందుతుంది. సుమారు పది రోజుల పాటు భారత ఆర్చర్లకు ఆయన శిక్షణ ఇవ్వనున్నారు.