
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన కురాష్(జూడో లాంటి ఆట)లో భారత్ రెండు పతకాలను సాధించింది. కిట్స్ కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేని స్థితిలో ఆసియా గేమ్స్కు వెళ్లిన టీనేజర్లు పింకీ బల్హరా రజతం, మలప్రభ జాదవ్ కాంస్యంతో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
మహిళల 52కేజీ విభాగంలో 19 ఏళ్ల పింకీ బల్హారా రజతం నెగ్గగా.. యల్లప్ప జాదవ్ కాంస్యం చేజిక్కించుకుంది. జూడో తరహాలో ప్రత్యర్థిని కిందపడేసే కురష్ ఆట గురించి వాస్తవానికి భారత్లో ఎవరికీ పెద్దగా తెలీదు. ఆసియా గేమ్స్లో కురాష్ ఆటను ఆడటం ఇదే తొలిసారి. అసలు ఈ క్రీడకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గుర్తింపు కూడా లేదు.
దీంతో అథ్లెట్ల కిట్స్కు తాము డబ్బులు ఇవ్వమని తేల్చి చెప్పింది. గేమ్స్కు ముందు ఉజ్బెకిస్థాన్లో 20 రోజుల క్యాంప్నకు వెళ్లాల్సి ఉండగా పింకీ దగ్గర చిల్లిగవ్వ లేదు. దీంతో గ్రామస్థులంతా ముందుకొచ్చి రూ. 1.75 లక్షలను పోగేశారు. దీంతో పింకీ అక్కడికి చేరుకోగలిగింది. ఇప్పుడు రజతం సాధించి తమ వారికి గర్వకారణంగా నిలిచింది.
మ్యాచ్ అనంతరం పింకీ మాట్లాడుతూ ''మా గ్రామస్థులంతా రూ.1.75 లక్షలు పోగు చేసి ఇస్తే నేను క్రీడలకు ముందు ఉజ్బెకిస్థాన్కు శిక్షణకు వెళ్లా. వాళ్లకెప్పుడూ రుణపడి ఉంటా'' అని చెప్పింది. అయితే, తమ ఆటగాళ్లు పతకాలు సాధించాక క్రీడామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తమను కలిశాడని, కురాష్కు త్వరలోనే గుర్తింపునిస్తామని తెలిపినట్టు కేఏఐ కార్యదర్శి రవి కుమార్ వెల్లడించారు.