జకార్తా: గతంలో జరిగిన పరాభవాన్ని పక్కకుపెట్టి పతకంతో అందరికీ సమాధానం చెప్పింది ద్యుతీ చంద్. భారత స్ప్రింట్ క్వీన్గా గుర్తింపు పొందిన ద్యుతి చంద్కి ఆసియా గేమ్స్లో రజత పతకం లభించింది. గేమ్స్లో 8వ రోజైన ఆదివారం 100 మీటర్ల పరుగులో పోటీపడిన ద్యుతీ చంద్ 11.32 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఆసియా గేమ్స్లో భారత్కి 100మీ ట్రాక్ ఈవెంట్లో పతకం రావడం గత 20ఏళ్లలో ఇదే తొలిసారి.
1998 ఆసియా గేమ్స్లో చివరిసారి భారత్కి 100మీ పరుగులో కాంస్య పతకం లభించింది. అప్పట్లో రచిత మిస్త్రీ ఈ పతకాన్ని గెలుపొందారు. ఫైనల్లో 100 మీటర్ల పరుగుని 11.30 సెకన్లలో పూర్తి చేసి ఎడిడాంగ్ స్వర్ణ పతకం గెలుచుకోగా.. 11.33 సెకన్లతో చైనాకి చెందిన యోగ్లీ కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే.. ఇటీవల 100మీ పరుగుని కేవలం 11.29 సెకన్లతో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ద్యుతి చంద్ ఆసియా గేమ్స్ ఫైనల్లో మాత్రం వెనకబడిపోయింది.
2014లో సస్పెన్షన్ని ఎదుర్కొన్న ద్యుతిచంద్ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత మళ్లీ ట్రాక్పైకి వచ్చి భారత్ పరువు నిలిపింది. టెస్టొస్టిరాన్ హార్మోన్ ఎక్కువ శాతం ఉండడంతో ద్యుతీ ఉత్ప్రేరకం వాడిందని అందుకే ఇలా జరిగిందంటూ ఆరోపణలు గుప్పించి అప్పటిలో సస్పెన్స్కు గురిచేశారు. ద్యుతి చంద్తో పాటు ఆదివారం మరో ఇద్దరు భారత స్ప్రింటర్లు హిమదాస్, మొహ్మద్ అనాస్లు రజత పతకాలను గెలుపొందారు.
మహిళల 400 మీటర్ల పరుగులో పోటీపడిన స్టార్ స్ప్రింటర్ హిమ దాస్ రజత పతకం గెలుపొందగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మహ్మద్ అనాస్ పురుషుల 400 మీటర్ల పరుగులో రజతాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ పతకంతో భారత్.. ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకూ భారత్ ఖాతాలో 36 పతకాలు చేరాయి. వాటిలో ఏడు స్వర్ణాలు, పది రజితాలు, 19 కాంస్యాలు ఉన్నాయి.