హైదరాబాద్: జిమ్నాస్టిక్ వరల్డ్ కప్లో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించిన అరుణ రెడ్డిని చూసి గర్వపడుతున్నానని మరో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తెలిపింది. సోమవారం కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి అథ్లెట్ల అధికారిక జెర్సీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దీపా కర్మాకర్తో పాటు హెచ్ఎస్ ప్రణయ్, జీతూ రాయ్, మను భాస్కర్, అనురాజ్ సింగ్, మన్ప్రీత్ సింగ్, రూపిందర్ సింగ్, రాణి రాంపాల్ తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమ అనంతరం దీపా కర్మార్కర్ జాతీయ మీడియాతో మాట్లాడింది. 'జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్లో అరుణా రెడ్డి కాంస్య పతకం నెగ్గడం సంతోషంగా ఉంది. జాతీయ శిక్షణ శిబిరంలో మేమిద్దరం ఒకే గదిలో ఉండేవాళ్లం. మేం చాలా సన్నిహితంగా ఉంటాం. కలిసినప్పుడల్లా.. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండట్లేదని అరుణ నాతో నిరాశగా చెప్పేది' అని పేర్కొంది.
జిమ్నాస్టిక్స్: చరిత్ర సృష్టించిన హైదరాబాద్ అమ్మాయి అరుణ
'అయితే నువు ఇలాగే కష్టపడు ఒకరోజు విజయం నీ సొంతం అవుతుందని తనతో అనేదాన్ని. చివరకు అది నిజం అయింది. కామన్వెల్త్ గేమ్స్లో ఆమె కచ్చితంగా స్వర్ణం గెలుస్తుందని నమ్ముతున్నా' అని వెల్లడించింది. శనివారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ పోటీల్లో హైదరాబాద్కు చెందిన అరుణ రెడ్డి కాంస్య పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే.
తద్వారా జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ పోటీల్లో కాంస్య పతకం గెలుపొందిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్స్ విభాగంలో నిర్వహించిన పైనల్స్లో అరుణ రెండుసార్లు పోటీపడి 13.649 యావరేజితో మూడో స్థానంలో నిలిచింది. స్లొవేనియాకు చెందిన కైసెల్ప్ (13.800) స్వర్ణం గెలుచుకోగా, ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలి వైట్హెడ్(13.699) రజతం దక్కించుకుంది.
మరోవైపు గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్కు దీపా దూరం కానుంది. గతేడాది ఏప్రిల్లో దీప మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున కామన్వెల్త్ గేమ్స్కు దూరమవక తప్పడం లేదని పేర్కొంది. 'కామన్వెల్త్కు దూరమవడం బాధగా ఉంది. గత క్రీడల్లో కాంస్యం నెగ్గాను. నేను లేకున్నా భారత జిమ్నాస్టిక్స్ జట్టు మెరుగ్గా రాణిస్తుందని ఆశిస్తున్నా' అని పేర్కొంది.
ఇదిలా ఉంటే కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ మార్చ్ ఫాస్ట్లో పాల్గొనే క్రీడాకారుల కోసం రేమండ్ సంస్థతో ప్రత్యేకంగా బ్లేజర్లు డిజైన్ చేయించారు. దీంతో అథ్లెట్ల అధికారిక జెర్సీని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్ ఆవిష్కరించారు.
Champions at the Centre
— Rajyavardhan Rathore (@Ra_THORe) February 26, 2018
Shared the stage @ioaindia press conf with talented young players who'd represent India at the Commonwealth Games 2018.
Best wishes to the Indian CWG contingent!
Great to see @edelweissfin @ShivNareshSport & @TheRaymondLtd supporting the athletes. pic.twitter.com/UJTqGmHEMs
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. భారత్ తరుపు నుంచి సుమారు 227 మంది ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. భారత్ తరుపు నుంచి ప్రాతినిథ్యం వహించే ఒక్కొక్కరికి రూ.50 లక్షల మేరకు బీమా వర్తించనుంది.
ఈ మేరకు ఎడల్వీస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. ఈ ఒప్పందం కామన్వెల్త్ గేమ్స్తో పాటు ఆసియా గేమ్స్, టోక్యో ఒలింపిక్స్(2020)కు కూడా వర్తించనుంది. 2018, 2019 జాతీయ క్రీడలనుకూడా ఆ సంస్థే స్పాన్సర్ చేస్తోంది.