
హైదరాబాద్: భారత ఆర్చర్, అర్జున పురస్కార గ్రహీత వెన్నం జ్యోతి సురేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మంగళవారం జ్యోతి సురేఖ సచివాలయంలో సీఎం వైయస్ జగన్ను కలిశారు. ఇటీవల బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్లో జ్యోతి సురేఖ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.
ఆర్చరీ పోటీల్లో సాధించిన పతకాలను ఆమె ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సందర్భంగా సీఎం ఆమెను శాలువతో సత్కరించారు. జ్యోతి సురేఖ వెంట మంత్రి పేర్ని నాని కూడా ఉన్నారు. కాగా, జ్యోతి సురేఖ ఆర్చరీలో కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోంది. ఆర్చరీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ఆమె సుమారు 80 పతకాలు సాధించారు.
జ్యోతి సురేఖ 2009లో టైజునాలో మెక్సికన్ గ్రాండ్ టోర్నీలో, అండర్-19 విభాగంలో ఒలింపిక్ రౌండ్లో స్వర్ణ పతకం సాధించింది. అదే వేదికపై మరో మూడు రజత పతకాలతో పాటు ఒక కాంస్య పతకాన్నీ సైతం సొంతం చేసుకుంది. ఇక, 2011లో టెహరానులో జరిగిన ఆసియా ఆర్చరీ ఛాంపియనుషిప్ పోటీల్లో మహిళా కాంపౌండ్ టీమ్ కాంస్య పతకం గెలిచిన జట్టులో సభ్యురాలు.
2013లో వుక్సి వేదికగా సాగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియనుషిఫ్ పోటీలలో కాంపౌండ్ జూనియర్ ఉమన్, కాంపౌండ్ మిక్సెడ్ డబుల్స్ విభాగాలలో కాంస్య పతకాలు సాధించింది. 2014 సెప్టెంబరులో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది.