
హైదరాబాద్: తన తండ్రి హర్వీర్ను కామన్వెల్త్ క్రీడల అధికారిక బృందంలో చేర్చకపోతే తాను మ్యాచ్లు ఆడబోనని సైనా నెహ్వాల్ హెచ్చరించడాన్ని మాజీ షట్లర్ గుత్తా జ్వాల తప్పుబట్టింది. ''ఈ దేశ అత్యుత్తమ షట్లర్లలో సైనా ఒకరని అంగీకరిస్తా. కానీ సామాజిక మాధ్యమంలో సైనా నెహ్వాల్ ఇలాంటి డిమాండ్లు చేయడం సరి కాదు. క్రీడా గ్రామంలో సైనా తండ్రి ఉండటంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇది వ్యక్తిగత డిమాండ్. పైగా సామాజిక మాధ్యమం ద్వారా ఇలాంటి డిమాండ్ చేయడాన్ని నేను ఆమోదించను'' అని జ్వాల తెలిపింది.
అసలేం జరిగింది:
కామన్వెల్త్ క్రీడలు చూసేందుకు క్రీడాకారుల తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వకపోవడంతో సైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. తాను ఆడబోనంటూ మొండికేసింది. ఎట్టకేలకు నిబంధనలు సడలించింది భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ). సైనా తండ్రి హర్వీర్కు కూడా అధికారికంగానే క్రీడా గ్రామానికి రావొచ్చంటూ అనుమతినిచ్చింది.
ఐఓఏ ఆగమేఘాల మీద హర్వీర్కు అక్రిడిటేషన్ ఇచ్చి అధికారికంగా కామన్వెల్త్ క్రీడల వేదికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. ''మా నాన్న విషయంలో పెద్ద రగడ నడుస్తోంది. ఆయనకు అక్రిడిటేషన్ ఇవ్వకపోతే నేను మ్యాచ్లు ఆడబోను'' అని సైనా ఐఓఏ అధికారి ఒకరికి లేఖ రాసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడే అథ్లెట్ల వెంట కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లడంపై ఐఓఈ ఈసారి ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఆటగాళ్లతో పాటు వాళ్ల తల్లిదండ్రుల ఖర్చులు ప్రభుత్వానికి అదనపు భారమవుతున్నాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఐతే తామే సొంతంగా ఖర్చులు భరించడానికి సిద్ధపడటంతో సైనా తండ్రితో పాటు సింధు తల్లి విజయ, మరో 13 మందిని కామన్వెల్త్ క్రీడల అధికార బృందంలో చేర్చింది ఐఓఏ. హర్వీర్ సమస్య పరిష్కారం కావడంతో ఐఓఏకు కృతజ్ఞతలు చెబుతూ సైనా ట్వీట్ చేసింది. ఐతే సైనా హెచ్చరికలపై గుర్రుగా ఉన్న ఐఓఏ అధికారులు.. టోర్నీ అయ్యాక ఆమెపై చర్యలు చేపట్టాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.