హైదరాబాద్: తాను స్వలింగ సంబంధంలో ఉన్నానంటూ భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ సంచలన ప్రకటన చేసింది. ఒడిశాలోని తన సొంత గ్రామానికి(చక్ర గోపాల్పుర) చెందిన ఓ అమ్మాయితో జీవితాన్ని పంచుకోబోతున్నట్టు చెప్పిన ఆమె తన భాగస్వామి పేరును మాత్రం వెల్లడించలేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
"నా జీవిత భాగస్వామి దొరికింది. తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే, వారితో జీవితాన్ని పంచుకునే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. స్వలింగ సంపర్కుల హక్కులు కాపాడేందుకు నేను ఎప్పుడు మద్దతుగా ఉంటా. ప్రేమను తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదు. అథ్లెట్ను అయినంత మాత్రాన నా నిర్ణయాన్ని ఎవరూ జడ్జ్ చేయాల్సిన పనిలేదు. అది నా వ్యక్తిగత విషయం" అని చెప్పింది.
"నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా. గత పదేళ్లుగా స్ప్రింటర్గా భారత్కు ఎన్నో విజయాలు అందించాను. మరో ఐదేళ్ల దాకా రాణిస్తాననే నమ్మకం ఉంది. నా క్రీడా ప్రయాణానికి సహకరిస్తూ.. జీవితాంతం తోడుండే వ్యక్తిని ఎంచుకున్నా. ఇక నా దృష్టి మొత్తం ప్రపంచ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ మీదనే. ఆటల నుంచి విరామం తీసుకున్న తర్వాత... భవిష్యత్తులో ఆమెతోనే సెటిల్ అవుతా" అని ద్యుతి పేర్కొంది.
స్వలింగ్ వివాహాలు ఇప్పటికీ భారతదేశంలో చట్టబద్దం కాదు. అయితే, గతేడాది సెప్టెంబర్లో సుప్రీం కోర్టు స్వలింగ సంబంధాలకు చట్టవిరుద్ధం కాదని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సమానత్వపు హక్కును హరిస్తున్న సెక్షన్ 377పై పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.