ఓటమితో ఆరంభం:
శనివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 25-31 తేడాతో యు ముంబా చేతిలో ఓడింది. టైటాన్స్ ఆటగాళ్లలో రజ్నిష్ 8 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకున్నా.. మిగతా వారి నుంచి సహకారం అందలేదు. ఇక కెప్టెన్ అబోజర్ నాలుగు సార్లు ట్యాకిల్లో విఫలమవడం టైటాన్స్పై తీవ్ర ప్రభావం చూపింది. స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ పూర్తిగా నిరాశపరిచాడు. 14 సార్లు రైడింగ్కు వెళ్లిన సిద్ధార్థ్ కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సాధించాడు. ఆరంభం నుంచి సిద్ధార్థ్ను కట్టడి చేస్తూ యు ముంబా మ్యాచ్పై పట్టు సాధించింది. ముంబా తరఫున అభిషేక్ సింగ్ 10 రైడ్ పాయింట్లు సాధించగా.. డిఫెన్స్ లో సందీప్ నర్వా ల్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నాడు.
చివరలో పోరాడినా:
తొలి ఐదు నిమిషాలు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అయితే పటిష్ట ఆటగాళ్లు ఉన్న ముంబా పదో నిమిషంలో 8-5తో ఆధిక్యంలో వెళ్ళింది. ఇక పదమూడో నిమిషంలో టైటాన్స్ను ఆలౌట్ చేసిన ముంబా 12-6తో ఆధిక్యం సంపాదించింది. ముంబా డిఫెన్స్ బృందం బలంగా ఉండడంతో టైటాన్స్ ఆటగాళ్లు పాయింట్లు సాధించలేకపోయారు. తొలి అర్ధభాగం ముగిసే సరికి 10-17తో టైటాన్స్ వెనకబడింది. విరామం తర్వాత కూడా అదే ఆటతీరు ప్రదర్శించిన టైటాన్స్ 26వ నిమిషంలో మరోసారి ఆలౌటై 13-24తోనిలిచింది. ఈ సమయంలో ముంబా మరింత పుంజుకోవడంతో టైటాన్స్ పరాజయం ఖాయమైంది. ఐతే చివర్లో టైటాన్స్ పుంజుకొని వరుసగా పాయింట్లు సాధించి భారీ ఓటమి తప్పించుకుంది.
బుల్స్ జోరు:
పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ రసవత్తరంగా సాగింది హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 34-32తో పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. బెంగళూరు తరపున స్టార్ రైడర్ పవన్ షెరావత్ (9), ట్యాకింగ్లో అమిత్ షెరోన్ (5) సత్తాచాటారు. పట్నా తరపున రైడింగ్లో డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ (10 పాయింట్లు) చెలరేగినా.. డిఫెన్స్ బలహీనతల కారణంగా పట్నాకు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఆరంభంలో 5-1తో ఆధిక్యం సాధించిన బెంగళూరు ఆపై తడబడింది. పుంజుకొన్న పైరేట్స్ 17-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పవన్ అద్భుత ఆటతో బుల్స్కు ఆధిక్యాన్ని అందించాడు. చివరి రెండు నిమిషాల ఆట ఉందనగా బెంగళూరు 34-31తో నిలిచింది. ఇదే ఆధిక్యాన్ని కొనసాగించి మ్యాచ్ గెలిచింది.