హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో యు ముంబా జట్టు ఆరో విజయం సొంతం చేసుకుంది. ఫజల్ అత్రాచలి ట్యాక్లింగ్లో అదరగొట్టడంతోనే యు ముంబా జట్టుకు విజయం సొంతమైంది. శనివారం జరిగిన జోన్-ఎ మ్యాచ్లో ముంబా 31-22తో పుణెరి పల్టాన్ను ఓడించింది. అత్రాచలి తాను చేసిన ఐదు ట్యాక్లింగ్స్లో నాలుగింట్లో సఫలం కావడం విశేషం. ఆరంభంలో పుణెరి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లినా.. దర్శన్ కడియన్ సూపర్ రైడ్ చేయడంతో యు ముంబా ఖాతా తెరిచింది.
ఆ తర్వాత దీపక్కుమార్ను పట్టేసిన యు ముంబా స్కోరును 5-1కి పెంచుకుంది. కొద్దిసేపట్లోనే పుణెరిని ఆలౌట్ చేసిన ముంబా 12-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అత్రాచలి మాయ మొదలైంది. అద్భుతమైన ట్యాక్లింగ్ చేసిన ఈ ఇరాన్ ఆటగాడు.. ముంబాకు 20-12తో తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. దీపక్ మరోసారి ముంబా డిఫెన్స్ను ఛేదించడంలో విఫలం కావడంతో పుణెరి మరోసారి ఆలౌటైంది. డిఫెన్స్లో అదరగొట్టిన ముంబా 31-22తో విజయాన్ని సొంతం చేసుకుంది.
యు మంబా తరఫున అభిషేక్ సింగ్ 7 రైడ్ పాయింట్లు, ట్యాక్లింగ్లో సురేందర్ సింగ్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. పుణేరీ తరఫున అక్షయ్ జాధవ్ 5 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 35-29తో యూపీ యోధాపై గెలిచింది. బెంగళూరు జట్టులో రోహిత్కుమార్ 14 రైడ్ పాయింట్లు సాధించగా.. కాస్లింగ్ అడ్కె రెండు ట్యాక్లింగ్లు చేశాడు. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు పోరాడాయి.
స్కోరు 10-10, 13-13.. ఇలా స్కోరు సమంగా సాగింది. కానీ రైడర్లు విజృంభించడంతో యూపీ యోధ 19-15తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ బెంగళూరు కూడా దీటుగా స్పందించడంతో 25-24తో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అక్కడ నుంచి వరుస పాయింట్లు సాధించి 35-29తో ఆధిక్యంలో నిలిచిన బెంగళూరు.. అదే జోరు ఆఖరి దాకా కొనసాగించి విజయాన్ని సొంతం చేసుకుంది.