
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్-7లో బెంగళూరు బుల్స్, యు ముంబా జట్లు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి. ఢిల్లీ, బెంగాల్, హరియాణా జట్లు ఇప్పటికే అర్హత సాధించిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 59-36తో హరియాణా స్టీలర్స్పై భారీ విజయం సాధించింది. బెంగళూరు తరఫున రైడర్ పవన్ షెరావత్ ఒక్కడే రికార్డు స్థాయిలో 39 పాయింట్లు సాధించాడు. పవన్ 39 పాయింట్లు సాధించి పీకేఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్లో అత్యధిక పాయింట్లు చేసిన ప్లేయర్గా నిలిచాడు. అంతకుముందు పర్దీప్ నర్వాల్ (33) పాయింట్లు సాధించాడు.
మ్యాచ్ ప్రారంభంలో హరియాణా జోరు కొనసాగింది. ఓ దశలో బుల్స్ను ఆలౌట్ చేసిన హరియాణా 12-6తో ఆధిక్యంలో నిలిచింది. అయితే పవన్ చెలరేగి వరుస పాయింట్లు సాధిస్తూ హరియాణా జోరుకు బ్రేక్ వేసాడు. ఈ క్రమంలో 12 నిమిషాల్లోనే సూపర్-10 సాధించాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి బుల్స్ 28-18తో ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత షెరావత్ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. అతడి ధాటికి రెండో అర్ధ భాగంలోనూ హరియాణా రెండు సార్లు ఆలౌటైంది. మ్యాచ్ చివరికి హరియాణా 23 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.
పవన్ షెరావత్ ఒక్కడు చేసిన పాయింట్లను హరియాణా జట్టు మొత్తం కలిసినా చేయలేకపోయింది. పవన్ ఈ సీజన్-7లో అద్భుత ఫామ్లో ఉన్నాడు. అతడి దాటికి ఏ ఒక్క జట్టు కూడా నిలబడలేకపోతోంది. ఇక హరియాణా జట్టులో రైడర్ ప్రశాంత్ కుమార్ 17పాయింట్లు చేసినా.. మిగతావారి సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. కాగా డిఫెండింగ్లో అసలు హరియాణా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
బుధవారం జరిగిన మరో మ్యాచ్లో కెప్టెన్ సుల్తాన్ ఫజల్ అత్రాఛలి రాణించడంతో యు ముంబా 30-26తో పట్నా పైరేట్స్ను ఓడించి ప్లేఆఫ్స్ చేరుకుంది. ముంబా జట్టులో అభిషేక్ సింగ్ (7), అతుల్ (5), రోహిత్ బలియన్ (5) రాణించారు. పట్నా తరఫున ప్రదీప్ నర్వాల్ (8) పోరాడినప్పటికీ.. జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో మూడుసార్లు చాంపియన్ అయిన పాట్నా ఈసారి నాకౌట్కు కూడా చేరలేక పదో స్థానానికే పరిమితమైంది. గురువారం జరిగే పోరులో తెలుగు టైటాన్స్తో పుణేరి పల్టన్ తలపడుతుంది.