
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్-7లో మరో మ్యాచ్ 'టై'గా ముగిసింది. ఆదివారం జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగినా.. చివరకు 31-31తో టైగా ముగిసింది. చివరి నిమిషంలో డూ-ఆర్-డై రైడ్లకు వెళ్లిన రాహుల్ చౌదరి, మంజీత్ విఫలమవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ సీజన్లో ఇది ఐదో 'టై' కావడం విశేషం.
మ్యాచ్ ఆరంభంలో రాహుల్ చౌదరి పాయింట్లు తేవడంలో విఫలమయ్యాడు. పల్టన్ డిఫెన్స్ గట్టిగా ఉండడంతో 11వ నిమిషంలోనే తలైవాస్ ఆలౌట్ అయింది. ఈ సమయంలో రాహుల్, అజిత్ పాయింట్లు తేవడంతో మొదటి సగం పూర్తయ్యే సరికి తలైవాస్ 13-15తో నిలిచింది. రెండవ సగంలో రాన్సింగ్ విజయవంతమైన టాకిల్స్ చేయడంతో తలైవాస్ పుంజుకుంది. అజిత్ కుమార్.. పంకజ్ మోతె, సుర్జీత్ సింగ్ చెలరేగడంతో మ్యాచ్ చివరి నిమిషంలో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి.
చివరి నిమిషంలో డూ-ఆర్-డై రైడ్లకు వెళ్లిన రాహుల్ చౌదరి, మంజీత్ విఫలమవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తలైవాస్ జట్టులో అజిత్ కుమార్ (8), రాన్సింగ్ (4).. పుణెరి జట్టులో పంకజ్ మోతె (7), సుర్జీత్ సింగ్ (7 )రాణించారు. ఆదివారం జరిగిన మరో పోరులో టైటాన్స్ 40-29తో హరియాణా స్టీలర్స్ను ఓడించింది. టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 18 పాయింట్లతో సత్తా చాటాడు. సోమవారం జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో హరియాణా స్టీలర్స్.. యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.