
ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్-7లో భాగంగా ప్రస్తుతం మ్యాచ్లు ఢిల్లీ అంచెలో జరుగుతున్నాయి. జూలై 20న ఆరంభమైన ఈ సీజన్లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ఈ సీజన్లో రైడర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పవన్ కుమార్ సెరావత్, నవీన్ కుమార్, పర్దీప్ నర్వాల్, సిద్దార్థ్ దేశాయ్, మణిందర్ సింగ్ లాంటి రైడర్లు టాప్ 5లో ఉన్నారు. వీరందరు తమ తమ జట్లకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెడుతున్నారు.
'ఈ సెంచరీ నాకెంతో ప్రత్యేకం.. కష్టకాలంలో అండగా నిలిచిన వారికి అంకితం'
లీగ్-7లో బెంగళూరు బుల్స్ అగ్రశ్రేణి రైడర్ పవన్ కుమార్ సెరావత్ బాగా రాణిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్కి దూకుడు పెంచుతూ.. ఈ సీజన్లో ఇప్పటికే 100 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ సీజన్లో 100 రైడ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడు కూడా పవన్ (124) కావడం విశేషం. పవన్ తర్వాత ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ (104) 100 రైడ్ పాయింట్లు సాధించాడు. ఆదివారం యూపీ యోధాతో జరిగిన మ్యాచ్లో నవీన్ కుమార్ 16 పాయింట్లు సాధించడంతో ఈ మార్క్ అందుకున్నాడు. పర్దీప్ నర్వాల్ (86), సిద్దార్థ్ దేశాయ్ (71), మణిందర్ సింగ్ (68)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ప్రొ కబడ్డీ లీగ్-7లో దబాంగ్ ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం యూపీ యోధాతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 36-27 స్కోరుతో విజయం సాధించింది. నవీన్ కుమార్ (16 పాయింట్ల) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవీందర్ పహల్ హై 5ను నమోదు చేశాడు. యూపీ తరపున మోను గోయత్ సూపర్-10 సాధించినా ఫలితం లేకపోయింది. సోమవారం బంగాల్ వారియర్స్ × హరియాణా స్టీలర్స్, యూపీ యోధ × పుణెరి పల్టాన్ జట్లు తలపడనున్నాయి.