హైదరాబాద్: ఆరు దేశాల కబడ్డీ మాస్టర్స్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ భారత్ హవా కొనసాగుతోంది టోర్నీలో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. అపజయమనేది లేకుండా దూసుకెళుతున్న అజయ్ ఠాకూర్ సేన శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 36-20 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. అజయ్ ఠాకూర్, మోను గోయత్ చక్కటి ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 10 రైడ్ పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెన్స్లో గిరీశ్ ఆకట్టుకున్నాడు.
ప్రత్యర్థి జట్టులో జాంగ్ కున్ లీ ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ ఆరంభంలో గట్టి పోటీనిచ్చిన కొరియా ఆ తర్వాత భారత్ ముందు నిలువలేకపోయింది. అటు తొలి సెమీఫైనల్లో ఇరాన్ జట్టు 40-21 తేడాతో పాకిస్థాన్పై నెగ్గింది. దీంతో శనివారం ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇరాన్ కూడా ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. ఇక కొరియాతో జరిగిన మ్యాచ్లో తొలి పది నిమిషాల్లో 3-7తో వెనకబడిన భారత్ ఆ తర్వాత పుంజుకుంది.
మోను గోయత్, అజయ్ ఠాకూర్ అద్భుతంగా ఆడి కొరియాను ఆలౌట్ చేయడంతో ఒక్కసారిగా 13-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాతా ఇదే జోరును ప్రదర్శించిన భారత్ ప్రథమార్థాన్ని 17-10తో ముగించింది. ద్వితీయార్ధంలో జట్టు రైడర్లతో పాటు డిఫెన్స్ విభాగం మెరుగ్గా రాణించడంతో ఓ దశలో 30-17తో నిలిచింది. అయితే చివరి ఐదు నిమిషాల్లో కొరియా కాస్త పోటీ ఇచ్చినా విజయం సాధించలేకపోయింది.
టైటిల్ కోసం భారత్ ఆదివారం ఇరాన్తో తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ను రాత్రి గం. 7.50 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.