
హైదరాబాద్: 2019 ప్రపంచ కబడ్డీ కప్నకు పంజాబ్ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు మ్యాచ్లు నిర్వహిస్తామని పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రానా గుర్మీత్ సింగ్ సోధి బుధవారం అధికారికంగా ప్రకటించారు.
అంతేకాదు సిక్కుల గురువు 'గురు నానక్ దేవ్జీ' 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సారి టోర్నీని ఆయనకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.
భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, కెన్యా, న్యూజిలాండ్, పాకిస్థాన్, కెనడా జట్లు టోర్నీలో ఆడనున్నట్లు తెలిపారు.
అయితే, పాకిస్థాన్, కెనడా జట్లకు భారత ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదని అన్నారు. "పాకిస్తాన్, కెనడా జట్లను తప్పించి మిగతా అన్ని జట్లకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ఓసి వచ్చింది. ఈ రెండు దేశాలకు సంబంధించిన ఎన్ఓసి కోసం ఇంకా ఎదురుచూస్తున్నాం" అని మంత్రి రానా గుర్మీత్ సింగ్ సోధి తెలిపారు.
టోర్నీ ప్రారంభ వేడుక డిసెంబర్ 1న సుల్తాన్పూర్ లోధిలోని గురు నానక్ స్టేడియంలో జరుగుతున్నట్లు గుర్మీత్ సింగ్ తెలిపారు. ఆ రోజు నాలుగు మ్యాచ్లు జరుగుతాయని పేర్కొన్నారు. డేరా బాబా నానక్లోని షాహీద్ భగత్సింగ్ స్పోర్ట్స్ స్టేడియంలో ముగింపు వేడుకలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.
వీటితో పాటు అమ్మృత్సర్లోని గురునానక్ స్టేడియం, ఫిరోజ్పుర్లోని భగత్సింగ్ స్టేడియం, బఠిండా, పటియాలాలోని స్పోర్ట్స్ స్టేడియాల్లో ప్రతి రోజు రెండు మ్యాచ్లు ఉంటాయని తెలిపారు. టోర్నీలో భాగంగా సెమీ ఫైనల్స్కు శ్రీ ఆనంద్పుర్ సాహిబ్లోని చరణ్గంగ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్లు తెలిపారు.