హైదరాబాద్: పురుష హాకీ క్రీడాకారులలో కలిసి ఆడటం వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని భారత మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ తెలిపింది. శనివారం పూణెలోని బేలవాడీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన హాకీ జాతీయ టోర్నీలో రాణి రాంపాల్ పాల్గొంది. హాకీ కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆమె హాకీ హర్యానా తరుపున బరిలోకి దిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాకీ ఆడే తొలిరోజుల్లో తాను పేదరికంతో పోరాడాల్సివచ్చేదని, హాకీని కెరీర్గా మలచుకున్నందుకు ఏనాడూ తాను చింతించలేదని తెలిపింది. మంచి ఉద్యోగం సాధించేందుకు హాకీని ఓ సాధనంగా ఎంచుకున్నానని, అది ఇప్పటికి నెరవేరిందని తెలిపింది. మంచి ఉద్యోగం, మంచి ఇల్లు పొందినందుకు తన తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారని తెలిపింది.
ఇటీవల ఆసియాకప్ విజయానంతరం రాణి రాంపాల్కు ఉద్యోగంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నగదు బహుమతి లభించింది. దీంతో తల్లిదండ్రులతో రాణి కలిసి కొత్త ఇంటికి మారింది. పుట్టి పెరిగిన ఊరిలోని తమ పాత ఇంటిని ఎన్నటికీ వదులుకోనని తెలిపింది. తాను నిక్కర్లు వేసుకుని హాకీ ఆడడం నచ్చని గ్రామంలోని పెద్దలు కొందరు తమ ఊరికే మచ్చ తీసుకొస్తోందని విమర్శించారని తెలిపింది.
అయితే, చివరకు అలాంటివారే తమ పిల్లలను హాకీ అకాడమీకి పంపించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. వారి మాటలు తనకు కోపం తెప్పించడం లేదని, వారి దృక్పథంలో మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉందని వివరించింది. హాకీ ఆడడం మొదలు పెట్టినపుడు ఒలింపిక్స్ గురించి తెలియదని, లండన్ ఒలింపిక్స్కు అర్హత మ్యాచ్లో ఓడినప్పుడు ఆ బాధ ఏంటో తనకూ అర్ధమైందని చెప్పింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.