టోక్యో: భారత మహిళల హాకీ జట్టను అత్యుత్తమంగా తీర్చిదిద్దిన కోచ్ జోయర్డ్ మరీన్ తన పదవికి రాజీనామా చేశారు. తన బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో భాగంగా కాంస్య పతకం కోసం భారత మహిళల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్తో మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల తరువాత ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్.. తన చివరి అసైన్మెంట్ అని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాననే భావిస్తున్నానని పేర్కొన్నారు. జోయర్డ్ మరీన్.. నెదర్లాండ్స్కు చెందిన కోచ్. 2017 నుంచి భారత మహిళల హాకీ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు.
గ్రేట్ బ్రిటన్తో మ్యాచ్తో భారత్ మహిళల హాకీ జట్టుతో తన ప్రయాణం ముగిసినట్లు మరీన్ స్పష్టం చేశారు. కోట్లాదిమంది భారతీయుల కలలను సాకారం చేయడానికి అహర్నిశలు శ్రమించానని భావిస్తున్నట్లు చెప్పారు. తనకు, మహిళల హాకీ జట్టుకు ఇన్నేళ్లుగా అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. టోక్యో ఒలింపిక్స్లో మహిళల హాకీ జట్టు పతకాన్ని సాధించలేకపోయినప్పటికీ.. అంతకంటే పెద్ద విజయాన్ని అందుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నామని పేర్కొన్నారు.
భారత మహిళా హాకీ జట్టులో పోరాట స్ఫూర్తి తొణికిసలాడుతోందనే విషయం క్రీడా ప్రపంచానికి టోక్యో ఒలింపిక్స్ వేదికగా తెలిసి వచ్చినట్టయిందని వ్యాఖ్యానించారు. ఆ పోరాట స్ఫూర్తితోనే పతకం కోసం టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్స్ వరకు చేరుకోగలిగామని అన్నారు. కోట్లాద మంది భారతీయుల నైతిక మద్దతుతో మహిళల జట్టు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తుందనే బలంగా నమ్ముతున్నానని మరీన్ చెప్పుకొచ్చారు. భారత మహిళల హాకీ జట్టు అందరి అంచనాలకు భిన్నంగా రాణించిందని, అంతర్జాతీయ స్థాయిలో ఆడే ప్రతి టోర్నమెంట్ కూడా విజయవంతం కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
జోయర్డ్ మారీన్ హఠాత్తుగా రాజీనామా చేయడానికి గల కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు. సుదీర్ఘ కాలంగా ఆయన తన కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తోన్నందు వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. భారత మహిళల హాకీ కోచ్ కాంటాక్ట్ గడువును పొడిగిస్తామనే సంకేతాలను హాకీ ఇండియా ఇచ్చినప్పటికీ.. ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. కుటుంబంతో గడపాలనే కారణంతోనే కోచ్గా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ అమలు చేసినప్పటి నుంచీ ఆయన భారత్లోనే ఉంటున్నారు. ఒలింపిక్స్ కోసం మహిళల హాకీ జట్టును తీర్చిదిద్దడంలో కీలకంగా మారారు.