ఈ సంవత్సరం చివరలో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్కు అర్హత సాధించేందుకు భారత హాకీ జట్టుకు మంచి అవకాశం ఉంది. భారత హాకీ జట్టు అర్హత సాధించాలంటే ఒక విజయం దూరంలో నిలిచింది. ఆసియా క్రీడల చాంపియన్ జపాన్తో శుక్రవారం జరిగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ సెమీఫైనల్లో భారత్ తలపడనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
లీగ్ దశలో రష్యా, ఉజ్బెకిస్థాన్, పోలెండ్పై గెలిచిన ఆత్మవిశ్వాసంతో భారత్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లోనూ నెగ్గి టైటిల్ పోరులో నిలవాలని మన్ప్రీత్ సింగ్ సేన పట్టుదలగా ఉంది. ఇక సొంత ప్రేక్షకుల మధ్య ఆడనుండటం భారత్కు కలిసొచ్చే అంశం. కొత్త కోచ్ గ్రాహమ్ రీడ్ శిక్షణలో ఇప్పటికే మంచి విజయాలు సాధించడం కూడా సానుకూలాంశం.
మ్యాచ్ ఆరంభంలోనే గోల్స్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలన్న టీమిండియా వ్యూహం మంచి ఫలితాలనిస్తోంది. ఉజ్బెకిస్థాన్పై హ్యాట్రిక్స్ గోల్స్ చేసిన ఆకాశ్ సింగ్తో పాటు మన్దీ్ప, వరుణ్పై భారీ అంచనాలున్నాయి. మన్ప్రీత్ ఆధ్వర్యంలో మిడ్ఫీల్డ్ పటిష్టంగా ఉంది. దీంతో భారత్ గోల్స్ చేసే అవకాశాలను సృష్టిస్తోంది. మొత్తంగా భారత జట్టు మంచి విజయాలు సాధిస్తూ ఊపుమీదుంది.
సెమీఫైనల్ మ్యాచ్లో భారతే ఫేవరెట్గా కనబడుతోంది. గత రెండు మ్యాచ్ల్లోనూ జపాన్పై భారత్ గెలిచింది. 'జట్టు ఆటతీరుతో సంతోషంగా ఉన్నా. గోల్స్ చేసే అవకాశాలను సృష్టిస్తున్నా.. కొన్నిసార్లు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ అంశంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది' అని కోచ్ గ్రాహమ్ అన్నారు.