
హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నీలో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. భారత హాకీ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. స్థానిక కళింగ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో భారత్ 0-2 గోల్స్తో జర్మనీ చేతిలో ఓటమిపాలైంది.
దీంతో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో ఓటమి పాలవ్వగా, మరో మ్యాచ్ని డ్రాగా ముగించింది. సోమవారం నాటి మ్యాచ్లో జర్మనీ తరఫున మార్టిన్ హేనర్ (17వ), గ్రామ్బుష్ (20వ) చెరో గోల్ సాధించగా... భారత్ మాత్రం తనకు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకోలేకపోయింది.

టోర్నీలో భాగంగా తొలుత ఆస్ట్రేలియాతో తలపడిన మ్యాచ్లో 1-1తో డ్రాగా ముగించిన భారత్ ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో 2-3తో ఓటమిపాలైంది. కేవలం ఒకే ఒక్క పాయింట్తో గ్రూప్-బిలో ఆఖరున నిలిచింది. కాగా, సోమవారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది.
టోర్నీలో పూల్ దశలో ఆడిన ఎనిమిది జట్లు మళ్లీ క్వార్టర్స్లో ఆడతాయి. క్వార్టర్స్లో పూల్-బిలో అట్టడుగున నిలిచిన భారత్.. పూల్-ఏలో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో క్వార్టర్స్లో తలపడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.