న్యూ ఢిల్లీ: 43 ఏళ్లుగా సెమీ ఫైనల్ చేరుకోని భారత్.. సొంతగడ్డపై జరుగుతున్న సమరంలో ఆ అవకాశం దక్కించుకోనుంది. గతంలో ఓ సారి 1975లో సెమీస్ చేరడంతో పాటు టైటిల్నూ ఎగరేసుకుపోయిన భారత్.. మరోసారి కప్పు అందుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్ కఠిన సవాలుకు సిద్ధమైంది. నెదర్లాండ్స్తో గురువారం జరగనున్న క్వార్టర్ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని బట్టి చరిత్రను తిరగరాస్తుందా అని చూడాలి.
సొంతగడ్డపై ఫేవరేట్గా భారత్ బరిలో దిగుతున్నప్పటికీ నెదర్లాండ్స్ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఆ జట్టుతో ఆడిన 6 మ్యాచ్ల్లో భారత్ 5 ఓడి, 1 డ్రాగా ముగించింది. చివరిసారిగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో నెదర్లాండ్స్ను ఢీకొంది. ఆ మ్యాచ్లోనూ 1-1తో డ్రాగా ముగించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో నెదర్లాండ్స్ 4వ స్థానంలో ఉంటే భారత్ దాని తర్వాతి ఐదో స్థానంలో ఉంది. ర్యాంకింగ్స్, ఫామ్ ప్రకారం చూసినా 2 జట్లు సమానంగానే ఉన్నాయని చెప్పొచ్చు.
'ప్రపంచకప్లో నెదర్లాండ్స్ మాపై ఆధిపత్యం చెలాయించింది. కానీ ఇటీవల ఆ జట్టుపై మా ప్రదర్శన బాగుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టుతో 2సార్లు తలపడగా.. ఓసారి ఓడించాం.. మరో మ్యాచ్ను డ్రాగా ముగించాం. మా 2 జట్ల మధ్య క్వార్టర్ఫైనల్ హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి.' అని భారత జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ తెలిపాడు.
ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు మొత్తం 105 మ్యాచ్ల్లో తలపడగా భారత్ 33 మ్యాచ్ల్లో, నెదర్లాండ్స్ 48 మ్యాచ్ల్లో జయకేతనం ఎగరవేశాయి. మిగతా మ్యాచ్లు డ్రా అయ్యాయి. ప్రస్తుతం 2 జట్లు మంచి ఫామ్లో ఉన్నాయి. గ్రూప్ మ్యాచ్ల్లో 2 జట్లు గోల్స్ వర్షం కురిపించాయి. భారత్ 12 గోల్స్ చేయగా.. నెదర్లాండ్స్ 18 గోల్స్ కొట్టింది.
సొంత అభిమానుల మద్దతుతో బరిలోకి దిగడం భారత్కు కలిసొచ్చే అంశం. సొంతగడ్డపై ఆడుతున్న భారత్పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, భారీ అభిమానుల మధ్య ఆడడం మాకు అలవాటే అని డచ్ కోచ్ మాక్స్ క్లాడాస్ చెప్పాడు. కాగా, మ్యాచ్లో వేగంగా ఆడుతూ ఆధిపత్యం చెలాయిస్తామని, మేం భారత ఆటతీరుపట్ల ఎలాంటి ఆందోళన చెందడం లేదని కెప్టెన్ బాకర్ పేర్కొన్నాడు. మరో క్వార్టర్స్లో జర్మనీతో బెల్జియం తలపడనుంది.