కెనడా, నెదర్లాండ్స్ మ్యాచ్ జరుగుతుండగా
సాధారణంగానే హాకీ ఆటగాళ్లకు వీఐపీ లాంజ్కు అనుమతి లేదు. అలాంటి అక్కడకు వెళ్లి అభిమానులకు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ సహా కొందరు ఆటోగ్రాఫ్లు ఇస్తుండటంతో అక్కడి వచ్చిన అధికారి గట్టిగా అరిచారు. నోరు మూసుకొని వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు. కళింగ మైదానంలో కెనడా, నెదర్లాండ్స్ మ్యాచ్ జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
నోరు మూసుకొని వెళ్లిపోండి
టోర్నీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు వీఐపీ లాంజ్లోకి ప్రవేశించకూడదు. కాగా, కొద్దిమంది సన్నిహితుల కోరిక మేరకు మన్ప్రీత్ సహా కొందరు ఆటగాళ్లు అక్కడి వచ్చారు. అభిమానులతో ఫొటోలు దిగారు. ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. ఈ హడావుడి చూసిన హాకీ ఇండియా అత్యున్నత అధికారి ఒకరు వెంటనే అక్కడి వచ్చారు. నిషేధిత ప్రాంతానికి వచ్చినందుకు వెంటనే వెళ్లిపోవాలని అందరి ముందు వెళ్లిపోవాలంటూ నిందించారు. ‘వెంటనే ఇక్కడ నుంచి వెళ్లండి. నిషేదిత ప్రాంతానికి రావడానికి మీకెంత ధైర్యం? ఇంకే మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్లిపోండి' అని అరిచారు.
అధికారులకు ఫోన్ ద్వారా వివరణ ఇచ్చా
అక్కడే అర్జున అవార్డు గ్రహీతలు, మరెందరో ప్రముఖులు ఉండటం గమనార్హం. ఆ అధికారి వ్యవహార శైలి సఖ్యతగా లేదంటూ అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ను ప్రశ్నించగా ‘ఇది మా పొరబాటే. తెలియకపోవడంతోనే అక్కడికెళ్లాం. ఇందులో ఎవరి బలవంతం లేదు. తప్పు అని తెలిసిన వెంటనే అక్కడి నుంచి వచ్చేశాం. ఆ తర్వాత అధికారులకు ఫోన్ ద్వారా వివరణ ఇచ్చాను. వారితో నిరంతరం టచ్లోనే ఉన్నాను. ఇటువంటి సంఘటనలు మా ఆటపై ప్రభావం చూపించవు' అని అన్నాడు. కాగా గురువారం రాత్రి నెదర్లాండ్స్తో టీమిండియా కీలక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాల్గొననుంది.