హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలువడానికి ఆతృతతో ఉన్నామని భారత స్టార్ డ్రాగ్ఫ్లికర్ రూపిందర్పాల్ సింగ్ అన్నాడు. గత వారం న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను దక్కించుకుని మంచి ఊపుమీదున్న టీమ్ఇండియా..ఆసియా క్రీడలకు సన్నాహాలు మొదలుపెట్టింది. కామన్వెల్త్ గేమ్స్(గోల్డ్కోస్ట్)లో గాయపడి కివీస్తో సిరీస్లో జట్టులోకొచ్చిన రూపిందర్పాల్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు.
'కామన్వెల్త్ గేమ్స్లో రజతం గెలిచిన న్యూజిలాండ్పై సిరీస్ గెలువడం జట్టు సత్తాను తెలిపింది. కండరాల గాయంతో ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీకి దూరమై జట్టులోకి వచ్చి మళ్లీ లయ దొరకబుచ్చుకోవడం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. జట్టు ఆటను టీవీలో వీక్షించడం ఏ ఆటగాడికైనా నచ్చదు. కానీ కీలకమైన ఆసియా క్రీడల కోసం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసియా గేమ్స్కు ముందు బంగ్లాదేశ్, దక్షిణకొరియా, న్యూజిలాండ్తో సిరీస్లు ఆడటం వల్ల జట్టు కూర్పుపై ఓ అవగాహన వచ్చింది.'
'యువకులు, అనుభవజ్ఞల మేళవింపుతో జట్టు సమతూకంగా కనిపిస్తుంది. ఇదే గెలుపు జోరు కొనసాగిస్తే ఆసియాలో మళ్లీ పసిడి పతకం కొల్లగొట్టవచ్చు. నా వరకైతే కామన్వెల్త్ గేమ్స్లో న్యూజిలాండ్ లాంటి పటిష్ఠమైన జట్టుతో పోరాడి సిల్వర్ మెడల్ సాధించడం అనేది గొప్ప విషయం. నేను ఛాంపియన్ ట్రోఫీని మిస్సయ్యాను. మళ్లీ నా రిథమ్ను పుంజుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. మున్ముందు ఆడనున్న బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్లలో చాలా మేజర్ టోర్నమెంట్లు జరగనున్నాయి.'
'ఇప్పటికే చాలా ప్రయోగాలు చేసి అలసిపోయాం. వాటి ద్వారా కొన్ని నేర్చుకున్నాం కూడా. జట్టులోని ఆటగాళ్లంతా కలిసి గోల్ చేయడమే టార్గెట్గా సిద్ధమవుతున్నాం. ఈ క్రమంలో మాకు ఒక వారం పాటు అయినా కాస్తంత విరామం దొరికితే బాగుండనిపిస్తుంది. ఎందుకంటే జట్టులోని కొందరు ఆటగాళ్లు ఏప్రిల్ 28నుంచి గ్యాప్ లేకుండా ఆడుతూనే ఉన్నారు' అని వెల్లడించాడు.