రష్యా నమ్మకద్రోహి అని ఐఎస్ ఉగ్రవాదుల హెచ్చరిక
టోర్నమెంట్ మ్యాచ్లు జరుగుతున్న స్టేడియంలపై దాడి చేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించారు. అంతే కాదు ముఖ్యమైన ఈవెంట్లపై దాడి చేయాలని సంకల్పించామని ఉగ్రవాదులు తేల్చి చెప్పారు. సిరియాలో ఉగ్రవాదులను అంతమొందిస్తున్న రష్యా తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. రష్యా నమ్మకద్రోహి అని ఐఎస్ ఉగ్రవాదులు పేర్కొన్నారు.
పారిస్ బాంబు దాడిలో 130 మంది మరణం
అంతేకాదు.. ఇటీవలి కాలంలో యూరప్ సభ్య దేశాల్లో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లపై పలుసార్లు ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు 2015 నవంబర్ 13న పారిస్లో ఫ్రాన్స్ వర్సెస్ జర్మనీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఉగ్రవాదులు జరిపిన మారణ హోమం అంతా ఇంతా కాదు. పారిస్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 130 మంది పౌరులు మరణించారు. స్టేడ్ డీ ఫ్రాన్స్ స్టేడియంలో మూడుసార్లు బాంబు పేలుళ్లు సంభవించాయి.
లండన్ వంతెననూ వదలని ఐఎస్ ఉగ్రవాదులు
ఫ్రాన్స్ వర్సెస్ జర్మనీ మ్యాచ్ వీక్షిస్తున్న అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండేను భద్రతా సిబ్బంది ఆగమేఘాల మీద స్టేడియం నుంచి బయటకు తరలించారు. మరోవైపు బ్రిటన్పైనా ఐఎస్ తన ఉగ్రవాద పంజా విసిరింది. గతేడాది లండన్ వంతెనపై జరిగిన ఉగ్రవాద దాడి చాలా ముఖ్యమైంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బొరోగ్ మార్కెట్ను కూడా ఉగ్రవాదులు వదల్లేదు.
వైదొలుగుతున్నట్లు ప్రకటించిన బ్రిటన్ విదేశీ మంత్రి బోరిస్ జాన్సన్
ఇప్పటికే పశ్చిమ దేశాలతో దౌత్య సంక్షోభాన్ని కొని తెచ్చుకున్న రష్యాలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహణ ఒక వివాదాస్పద కార్యక్రమంగా మారనున్నదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి బోరిస్ జాన్సన్ ఇప్పటికే ఫిఫా వరల్డ్ కప్ నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. ప్రాతినిధ్య స్థాయికి మాత్రమే పరిమితం అవుతున్నట్లు చెప్పారు. అయితే అభిమానులకు బాధ కలిగించే పని చేయబోమని బ్రిటన్ పార్లమెంట్ సాక్షిగా బోరిస్ జాన్సన్ హామీ ఇచ్చారు అది వేరే సంగతి.
హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తారని పుతిన్పై బోరిస్ జాన్సన్ వ్యాఖ్య
ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఉద్దేశించి బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్య వివాదాస్పదంగా మారింది. 1936లో మ్యునిచ్ ఒలింపిక్స్ సందర్భంగా జర్మనీ అధినేత అడాల్ఫ్ హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తారని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. అయితే బ్రిటన్ మాజీ గూఢచారి సెర్గెయి స్క్రిపాల్పై రష్యా విష ప్రయోగం చేసిందన్న ఆరోపణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోసిపుచ్చారు.
సోషల్ మీడియాలో బ్రిటన్కు వ్యతిరేకంగా అభిమానుల హెచ్చరికలు
తాజాగా ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేయడంతో ఫిఫా టోర్నమెంట్ నిర్వహణ తీరుపై మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయి. రష్యన్లు తమను లక్ష్యంగా చేసుకుంటారేమోనని బ్రిటన్లోని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతా ఊహించినట్లే సోషల్ మీడియాలో ‘రష్యన్ హోలీగన్స్' అనే గ్రూప్ ‘మేం ఆపరేషన్ ముండియాల్' ప్రారంభించాం అని పేర్కొనడం గమనార్హం. మా ప్రణాళికలు అమలు దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఒక రష్యా అభిమాని మరో అడుగు ముందుకేసి పోరాటం తమ రక్తంలోనే ఉన్నదని.. వచ్చే జూన్ నెలలో జరిగే ఫిఫా టోర్నమెంట్ సందర్భంగా దాన్ని రుచి చూపిస్తామని పేర్కొన్నారు.
రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దని ఇంగ్లాండ్ అభిమానులకు హితవు
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్ ఫుట్బాల్ అభిమానులకు రష్యాలో ఇబ్బందులు తలెత్తుతాయని బ్రిటన్ విదేశీ, కామన్వెల్త్ వ్యవహారాల (ఎఫ్సీఓ) ముందే అంచనా వేసింది. బ్రిటన్, రష్యా మధ్య ఇటీవల ఏర్పడిన రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ దఫా బ్రిటిష్ వ్యతిరేక సెంటిమెంట్ రష్యాలో బలపడే అవకాశం ఉన్నదని, రష్యాకు వెళ్లే ఫుట్బాల్ అభిమానులకు ఈ దఫా వేధింపులు తప్పకపోవచ్చునని ఎఫ్సీఓ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. రష్యాకు వెళ్లే ఫుట్బాల్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని, ప్రదర్శనలకు, నిరసనలకు దూరంగా ఉండాలని సూచించారు. దీనికి తోడు రాజకీయ పరిణామాలపై బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యానాలు చేయవద్దని కోరారు. ఆస్ట్రేలియాలో రష్యా రాయబారి మాట్లాడుతూ ఈ వివాదం ఎంతో కాలం ఉండకపోవచ్చునని వ్యాఖ్యానించారు.