మెల్లగా మేల్కొనే ప్రక్రియ ప్రారంభమైంది
‘భారత్లో 130 కోట్లకు పైగా జనాభా ఉంది. వారిలో 130 కోట్ల మంది ఫుట్బాల్ ఆడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ నిద్రపోతున్న దిగ్గజం. ఈ దిగ్గజం నిద్రలేపడానికి ఒక అలారం క్లాక్ సరిపోక పోవచ్చు. రకరకాల అలారం క్లాక్లను ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఆ మాటకొస్తే భారత్ ఇప్పటికీ నిద్రపోతోందని చెప్పడం సబబు కాదు. అది మెల్లగా మేల్కొనే ప్రక్రియ ప్రారంభమైంది' అని బ్లాటర్ వ్యాఖ్యానించారు.
నిద్రపోతున్న దిగ్గజం' కదలిక లేదు
ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఆరేళ్లు అవుతున్నా ‘నిద్రపోతున్న దిగ్గజం' ఇంకా కదలిక లేదు. నిద్ర లేస్తున్న సూచనలు కూడా లేవు. భారత్లో జనాభా ఎక్కువగా ఉంది కనుక ఫుట్బాల్లో (ఆ మాటకోస్తే ఏ ఆటలోనైనాసరే) రాణించే సామర్థ్యం భారత్కు ఎక్కువగా ఉంటుందని భావించడం అర్థరహితం. ఒలింపిక్స్, సాకర్ వరల్డ్కప్ పోటీలు వచ్చినప్పుడల్లా అనివార్యంగా భారత్ ప్రస్తావన వస్తోంది.
బలమైన పునాదులు లేకుండా భవంతులు నిర్మించలేం
2017, అక్టోబర్ నెలలో అండర్-17 ఫుట్బాల్ వరల్డ్ కప్ను భారత్ నిర్వహించింది. అలాంటి అవకాశం దొరకడం ఒక అదృష్టం. ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని దేశంలోని యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి క్రీడా సంస్కృతి పరిఢవిల్లేందుకు అందమైన బాటలు వేసి ఉంటే ఎంతో బాగుండేది. టోర్నమెంట్ వచ్చిందీ వెళ్లింది. భారత్ నిద్రలేవలేదు. బలమైన పునాదులు లేకుండా ఫుట్బాల్లో రాణించలేం.
భారత్ ఇప్పటికీ వెనకబడే ఉంది
అట్టడుగు స్థాయి క్రియాశీలత, అందుకు ప్రోత్సాహక వ్యవస్థలు అవసరం. ఈ విషయంలో భారత్ ఇప్పటికీ వెనకబడే ఉంది. పేరుకు భారత్లో అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఉంది. క్రీడా సంస్కృతి లేకుండా ఎన్ని మౌలిక సౌకర్యాలున్నా లాభం లేదు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్యహించే వ్యవస్థలు ఉన్నప్పుడు, అవి సవ్యంగా పనిచేసినప్పుడు క్రీడా సంస్కృతి పెరుగుతుంది.