
ప్రపంచ ఫుట్బాల్ ఫెడరేషన్ అయిన FIFA.. 'FIFA చట్టాల ఉల్లంఘనల' జరిగిందని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF)ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెలువడ్డ వారం తర్వాత.. ఏఐఎఫ్ఎఫ్పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టుకు కేంద్రం అనేక ప్రతిపాదనలు చేసింది. ఫిఫాతో కేంద్రం జరిపిన చర్చల ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. AIFF పరిపాలన, నిర్వహణను ఎన్నికైన రూలింగ్ బాడీ ద్వారా నిర్వహించాలని ప్రతిపాదించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మూడవ పక్షం (అంటే అడ్మినిస్ట్రేటర్ల కమిటీ, లేదా CoA) చేత నిర్వహించబడొద్దని, అందువల్ల CoA పదవీకాలం తక్షణమే ముగించేలా చూడాలని ప్రతిపాదించింది.
'ఏఐఎఫ్ఎఫ్ సస్పెన్షన్ మొత్తం దేశానికి, ఫుట్బాల్ ఆటగాళ్లందరికీ చేటు కలిగించేది' అని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఇకపోతే FIFA తన సస్పెన్షన్ ఆర్డర్లో 'థర్డ్ పార్టీల జోక్యం మితిమీరిందని' పేర్కొంది. అలాగే ఈ ఏడాది అక్టోబర్లో ఇండియాలో జరగాల్సిన U-17 మహిళల ప్రపంచ కప్ను ఇక ఇండియాలో నిర్వహించలేము.. వేరే వేదికకు మార్చుతాము' అని కూడా పేర్కొంది.
ఈ కేసు నేపథ్యంలో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CoA) పదవీకాలాన్ని వెంటనే ముగించాలని, ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ రోజువారీ నిర్వహణను తాత్కాలిక సెక్రటరీ జనరల్ నేతృత్వంలో AIFF పరిపాలన జరగాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. రూలింగ్ బాడీ ఎన్నికలను మొదటి నుంచి ప్రారంభించాలని కూడా విన్నవించింది. అలాగే AIFF ఓటర్ల జాబితాలో AIFF రాష్ట్ర/UT సభ్య సంఘాల ప్రతినిధులు మాత్రమే ఉండాలని, ఆటగాళ్లను చేర్చకూడదని ప్రతిపాదించింది. కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలను నిర్వహించడానికి AIFF సాధారణ అసెంబ్లీ ద్వారా స్వతంత్ర ఎన్నికల కమిటీని ఎన్నుకోవాలని కూడా సుప్రీం కోర్టుకు సూచించింది. ఇక AIFFలో CoA పాత్ర ఆగస్టు 23న ఎట్టి పరిస్థితుల్లో ముగియాలని, ఎన్నికలు త్వరగా నిర్వహించాలని AIFF కోరుకుంటుందని పేర్కొంది. తద్వారా కొత్తగా ఎన్నికైన సంస్థ AIFF వ్యవహారాలను చేపట్టవచ్చు అలాగే FIFA సస్పెన్షన్ ఎత్తివేత జరుగుతుందని కేంద్రం విన్నవించింది. ఈ ప్రతిపాదనలను సుప్రీం కోర్టు కీలక విషయాలుగా పరిగణించింది. వీటిపై విచారణ జరపనుంది.