హైదరాబాద్: రష్యాలో గురువారం ఆరంభం కానున్న ఫుట్బాల్ ప్రపంచకప్ను భారత్లోని అభిమానులందరికీ మరింత చేరువ చేసేందుకు ప్రాంతీయ భాషల్లో ప్రసారాన్ని ఇవ్వనున్నట్లు సోనీ ఇండియా విభాగాధిపతి (క్రీడా) ప్రసన్న కృష్ణన్ తెలిపాడు. సోమవారం బంజారాహిల్స్లోని తాజ్కృష్ణ హోటల్లో జరిగిన విలేకర్ల సమావేశంలో అతను మాట్లాడాడు. ఈ మెగాటోర్నీలో భారత దేశం పాల్గొనలేకపోతున్నా కూడా ఫుట్బాల్ అభిమానులు దీన్ని ఎక్కువగానే అనుసరిస్తారనే నమ్మకంతో తెలుగులో ప్రసారం చేయనున్నామని వెల్లడించారు.
ఫుట్బాల్ ఆటగాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులుండటం సర్వ సాధారణం. వారి మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలని ఉన్నా అందరికీ కుదరకపోవచ్చు. అలా ఎదురుచూసే వారికి శుభపరిణామం. ఇలా చూస్తూనే తమ అభిమాన ఆటగాడి జట్టుకు మద్దతు తెలిపే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో 'మేరీ దూస్రీ కంట్రీ (నా మరో దేశం)' పేరుతో నిర్వహిస్తున్న ప్రచారానికి గొప్ప స్పందన వస్తుందనే నమ్మకంతో ప్రసారానికి సిద్ధమైయ్యాయి.
'ఈ ప్రపంచకప్కు అర్హత సాధించని 160 దేశాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఆంగ్లం, హిందీతో పాటు ప్రాంతీయ భాషలైన.. బెంగాళీ, తమిళం, మలయాళం, తెలుగులోనూ ప్రత్యేక ప్రసారం చేయనున్నారు. భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి, మాజీ కెప్టెన్ భైచుంగ్ భుటియా, ఛాంపియన్స్ లీగ్ విజేత లూయిస్ గార్సియా, మాంచెస్టర్ మాజీ ఆటగాడు లూయిస్ సాహాలతో కూడిన ప్యానెల్ ఈ ప్రసారాన్ని మరింత ఆకట్టుకునేలా చేయనుంది.'
'సోనీ ఈఎస్పీఎన్లో తెలుగులో ప్రపంచకప్ మ్యాచ్లను చూడవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో వీక్షకులను ఆకట్టుకుంటామనే నమ్మకం ఉంది. ప్రపంచంలోనే భారీ క్రీడా సమరమైన ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. ఇంతకుముందు వరకూ జరిగిన క్రీడలకు కామెంటేటర్గా వ్యవహరించిన వాళ్లు దాదాపు మాజీ ప్లేయర్లే అయి ఉండేవాళ్లు. కానీ ఈ సారి కామెంటేటరీ చెప్పే వాళ్లు మాత్రం అలా కాదు. ప్రొఫెషనల్స్ కాబట్టి చక్కగా చేయగలరనే ఆశిస్తున్నా' అని ప్రసన్న కృష్ణన్ తెలిపాడు.